హైదరాబాద్: నిషేధాన్ని ముగించుకొని ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాపై దేశ రాజధాని ఢిల్లీలో కేసు నమోదైంది. మారియా షరపోవా ప్రచారకర్తగా వ్యవహరించిన ఓ గృహ నిర్మాణ సంస్థ తనను మోసం చేసిందంటూ భావన అగర్వాల్ అనే మహిళ కోర్టుని ఆశ్రయించింది.
గుర్గావ్లోని విలాసగృహ సముదాయ ప్రాజెక్టు నిర్మిస్తున్న హోమ్స్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీకి షరపోవా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. అయితే, ఈ కంపెనీ టెన్నిస్ అకాడమీ, దుస్తులు, క్రీడా ఉపకరణాల దుకాణం పెట్టుకునేలా ప్లాట్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని ఆశ చూపించి పెట్టుబడులు పెట్టించింది.
ఇందుకోసం గాను 2013లో తమ నుంచి రూ. 53 లక్షలు తీసుకుందనీ.. కానీ ఇప్పటివరకు ఆ కంపెనీ హామీ నిలబెట్టుకోలేకపోయిందని ఢిల్లీకి చెందిన భావనా అగర్వాల్ అనే వ్యక్తి నార్త్వెస్ట్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేళ్లు గడిచినా ప్రతిపాదిత స్థలంలో ఎలాంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదని ఆ పిటిషన్లో ఆమె కోర్టుకు తెలిపారు.
దీంతో ఈ పిటిషన్ను విచారించిన కోర్టు సంస్థ డైరెక్టర్లతో పాటు ప్రచారకర్తగా వ్యవహరించిన షరపోవా మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.