దుబాయ్: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా జోడీ నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో సానియా మీర్జా (భారత్)-కరోలినా గార్సియా (ఫ్రాన్స్) ద్వయం 4-6, 2-6తో సాయ్సాయ్ జెంగ్ (చైనా)-బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. సానియా జోడి వరుస సెట్లలో పరాజయం పాలై దుబాయ్ ఓపెన్ నుండి నిష్క్రమించింది.
IPL 2020: ముంబై కోచ్ సూచన.. ఐపీఎల్ ముందు హార్దిక్ మ్యాచ్లు ఆడాలి!!
అంతకుముందు మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా-కరోలినా గార్సియా ద్వయం 6-4, 4-6, 10-8తో 'సూపర్ టైబ్రేక్'లో అలా కుద్రయెత్సెవా (రష్యా)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటను ఓడించింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జంట ఐదు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది.
2017 అక్టోబర్లో చైనా ఓపెన్ ఆడిన సానియా.. ఆ తర్వాత గాయపడటంతో ఆటకు విరామం ఇచ్చింది. ఇక 2018 అక్టోబర్లో మగబిడ్డ ఇజాన్కు జన్మనివ్వడంతో రెండేళ్లు ఆటకు దూరమైన సానియా.. రీ ఎంట్రీలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గి సత్తాచాటింది. ఈ టోర్నీ అనంతరం ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. కాలి పిక్క గాయంతో అర్థాంతరంగా తప్పుకుంది. అనంతరం రెండు వారాల్లోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుబాయ్ ఓపెన్ బరిలోకి దిగింది.
మరోవైపు ఫ్రాన్స్లో జరుగుతున్న మార్సెలీ ఓపెన్ ఏటీపీ-250 టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)-షపోవలోవ్ (కెనడా) జోడి 5-7, 7-6 (7/3), 8-10తో నీల్సెన్ (డెన్మార్క్)-టిమ్ పుయెట్జ్ (జర్మనీ) ద్వయం చేతిలో పరాజయం [పాలైంది.