ఫార్మాట్ ఏదైనా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోరు అంటే భారత్దే పైచేయి. అదే రికార్డును కొనసాగిస్తూ డేవిస్ కప్లోనూ పాక్పై భారత పురుషుల టెన్నిస్ జట్టు ఘన విజయం సాధించింది. 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్లో ఆడిన భారత జట్టు అదరగొట్టింది. ప్రత్యర్థి సొంతగడ్డపైనే పాక్ను కోలుకోలేని దెబ్బకొట్టింది. వరుస విజయాలతో పాకిస్థాన్ను నిస్సహాయస్థితిలో ఉంచింది.
పాకిస్థాన్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 4-0తో చిత్తు చేసి భారత్ డేవిస్కప్ ప్రపంచ గ్రూప్-1లోకి ప్రవేశించింది. రామ్కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ సత్తా చాటడంతో శనివారం 2-0 ఆధిక్యంలో భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆటలోనే భారత్ అదే జోరు ప్రదర్శించింది. డబుల్స్, రివర్స్ సింగిల్స్ను చేజిక్కించుకుని ఘన విజయాన్ని సాధించింది.

డబుల్స్లో ముజామిల్ మొర్తజా-అకీల్ఖాన్ జోడీని సాకేత్ మైనేని-యుకి బాంబ్రి జంట 6-2, 7-6 (7-5)తో ఓడించింది. తొలి సెట్లో భారత జోడికి పాక్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కానీ రెండో సెట్లో గట్టిపోటీనిచ్చింది. ఓ దశలో భారత జంట 2-4తో వెనుకబడింది. కానీ తర్వాత గొప్పగా పంజుకుంది. పట్టుదలతో నిలిచి మ్యాచ్ను సొంతం చేసుంది. ఈ గెలుపుతో భారత్ విజయం ఖారారైపోయింది.

అయితే అంతగా ప్రాధాన్యంలేని నాలుగో మ్యాచ్లో తాను ఆడతానని భారత ఆటగాడు నికీ పూంచా కోరడంతో ఆ మ్యాచ్ను నిర్వహించారు. నామమాత్రమైన ఈ రివర్స్ సింగిల్స్ మ్యాచ్లో అరంగేట్ర ఆటగాడు పూంచా 6-3, 6-4తో మహ్మద్ షోయబ్పై గెలిచాడు. ఇక చివరి రెండో రివర్స్ సింగిల్స్ ఆడలేదు. కాగా, పాక్పై భారత్కు ఇది ఎనిమిదో విజయం. 1964 తర్వాత పాక్ గడ్డపై భారత టెన్నిస్ జట్టుకు ఇదే తొలి గెలుపు.