వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ జానిక్ సినర్కు చుక్కెదురైంది. ఈ ఇటలీ స్టార్ ఉత్కంఠ భరితంగా సాగిన క్వార్టర్స్ ఫైనల్లో ఓటమిపాలయ్యాడు. రష్యా ప్లేయర్ మెద్వెదెవ్ చేతిలో 7-6(7), 4-6, 6-7(4), 6-2, 3-6తో పరాజయాన్ని చవిచూశాడు. అయిదు సెట్లపాటు జరిగిన ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
అయితే మూడో సెట్లో సినర్ చికిత్స తీసుకోవడానికి లాకర్ రూమ్కు వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత గొప్పగా పోరాడాడు. నాలుగో సెట్ను 6-2తో నెగ్గాడు. కానీ నిర్ణయాత్మక ఆఖరి సెట్లో మాత్రం తడబడ్డాడు. ఈ హోరాహోరీ పోరు నాలుగు గంటల పాటు సాగింది. కాగా, మెద్వెదెవ్కు వింబుల్డన్లో ఇది వరుసగా రెండో సెమీస్.

మరోవైపు స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కారజ్ కూడా సెమీస్ చేరాడు. అమెరికా ప్లేయర్ టామీ పాల్పై మూడో సీడ్ అల్కారజ్ 5-7, 6-4, 6-2, 6-2తో ఘన విజయం సాధించాడు. తొలి సెట్ ఓటమి అనంతరం పంజా విసిరాడు. వరుసగా మూడు సెట్లు గెలిచి సెమీస్ చేరాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో డొనా వెకిచ్ (క్రొయేషియా), జాస్మిన్ పౌలిని (ఇటలీ) సెమీఫైనల్స్కు అర్హత సాధించారు.

అన్సీడెడ్ ప్లేయర్ డొనా వెకిచ్ కెరీర్లో తొలిసారి గ్రాండ్ స్లామ్ సెమీస్లోకి అడుగుపెట్టింది. న్యూజిలాండ్ ప్లేయర్ లులూ సున్పై 5-7, 6-4, 6-1తో సత్తాచాటింది. ఇక 7వ సీడ్ పౌలిని 6-2, 6-1తో అమెరికా నవారోపై గెలిచి సెమీస్కు దూసుకెళ్లింది. కాగా, పురుషుల సింగిల్స్లో నొవాక్ జొకోవిచ్ క్వార్టర్స్కు చేరుకొన్నాడు. 6-3, 6-4, 6-2తో నార్వే ఆటగాడు హోల్డర్పై గెలిచాడు.