హైదరాబాద్: ఆస్ట్రేలియాపై తొలిసారి ట్వంటీ 20 సిరీస్ గెలుపొందిన మహిళల క్రికెట్ జట్టుకు, ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన సానియా మీర్జాకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు అభినందనలు తెలిపారు.
వరుసగా మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడమే కాకుండా వరుసగా 36 మ్యాచ్లు గెలిచిన ఘనత కూడా సానియా - మార్టినా హింగీస్ సాధించడం అసాధారణమన్నారు. ఇదే జోరు కొనసాగించి క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ సాధించడంతో పాటు మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
మహిళల డబుల్స్ టెన్నిస్లో సానియా మీర్జా - మార్టినా హింగిస్ జోడి హవా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ జోడి తమ ఖాతాలో మరో గ్రాండ్స్లామ్ టైటిల్ను వేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సానియా-హింగిస్ జోడి 7-6, 6-3 స్కోర్తో చెక్రిపబ్లిక్కు చెందిన హవకోవా-హడేకా జంటపై గెలుపొందారు. సానియా-హింగిస్ జోడికి ఇది వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం.
అదే విధంగా ఆస్ట్రేలియా పైన టీ-20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ స్టార్ క్రికెటర్ మిథాలీరాజ్ నాయకత్వంలోని మహిళల జట్టు అద్భుత పోరాట ప్రతిభ కనబరిచి ఆస్ట్రేలియాలోనే ఆ దేశ జట్టుపై విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. క్రీడల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు అమ్మాయిలందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.