
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా ప్రాముఖ్యత దినదినాభివృద్ధి జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిభను చాటి చెప్పేలా.. యువ కెరటాలు ఎగసిపడుతున్నాయి. సైనా నెహ్వాల్, సానియా మీర్జా లాంటి స్టార్ క్రీడాకారిణిల స్ఫూర్తితో యువరక్తం దూసుకొస్తుంది. ఈ క్రమంలో సానియా వారసురాలిగా యువ టెన్నిస్ ప్లేయర్ చాందినీ శ్రీనివాసన్ అదరగొడుతుంది. బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో సత్తాచాటుతుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్లో కజకిస్థాన్ వేదికగా జరిగే ఐటీఎఫ్ ఆసియా అండర్-12 టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు చాందిని ఎంపికైంది. హైదరాబాద్లోని సైనిక్పురికి చెందిన చాందిని శ్రీనివాసన్.. శ్రుతి అహ్లావత్(హర్యానా), దుర్గాంశి(ఢిల్లీ)తో కలిసి భారత్ తరఫున టోర్నీ బరిలోకి దిగుతుంది.
తల్లీదండ్రుల ప్రోత్సాహంతోనే..: మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాసన్కు క్రీడలంటే మక్కువ. ప్రతిభ చాటుతున్న కూతురు కోసం తన బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి అన్నీ తానై చూసుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎవరైనా స్పాన్సర్లు ముందుకొస్తే.. దేశ, రాష్ట్ర ప్రతిష్ఠను చాందిని పెంచేందుకు కృషి చేస్తానంటోంది.
వెల్లువలా విజయాలు: పిట్టకొంచెం కూత ఘనం అన్న రీతిలో చాందిని తన ప్రతిభ చాటుతుంది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే రాకెట్ చేతబట్టిన ఈ హైదరాబాదీ గెలుపును ఆలంభనగా మలుచుకుంది. వయస్సు చిన్నదైనా..ప్రతిభకు కొదువలేదన్నట్లు వరుస టైటిల్ విజయాలతో ఆకట్టుకుంటుంది. ఇండోర్లో జరిగిన ఏఐటీఏ అండర్-12 సూపర్ సిరీస్ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ టైటిళ్లు గెలిచి తనకు సాటిలేరని నిరూపించింది. ఐటీఎఫ్ ఆసియా అండర్-12 టోర్నీలో విజయం సాధించేందుకు సన్నద్ధమవుతున్న చాందిని.. ప్రస్తుతం టోర్నీలో ఆడుతుంది.