హైదరాబాద్ : హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లపై గురువారం కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యవహరించారంటూ ఓ మత సంస్థ ప్రతినిధి నాంపల్లి కోర్టులో సానియా, షోయబ్ దంపతులపై పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో వారిపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సానియా, షోయబ్ లపై, మరో 13 మందిపై కేసు నమోదు చేశారు. అయేషా సిద్ధిఖితో వివాదం కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న పాస్ పోర్టును హైకోర్టు ఉత్తర్వుల ద్వారా షోయబ్ పొందారు. ఆ సమస్య ముగిసిందని భావిస్తున్న తరుణంలో షోయబ్ కు ఈ కొత్త కష్టం వచ్చి పడింది.