హైదరాబాద్ : అన్నీ సర్దుకున్నాయనుకున్న సమయంలో కొత్త దంపతులు భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లకు కొత్త కష్టం వచ్చి పడింది. వారిపై మరో కేసు నమోదైంది. వారిద్దరు మతాచారానికి విరుద్దంగా పెళ్లి చేసుకున్నారంటూ హైదరాబాద్ లోని నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ కోర్టులో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో సానియా, షోయబ్ లపై కేసు నమోదు చేయాలని కోర్టు హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. అయేషాతో విడాకులు ఇప్పించిన ఇద్దరు పెద్దలపై కూడా ఆ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సానియా, షోయబ్ లు మతాన్ని తప్పుగా వాడుకోవడానికి రసూల్ ఖాన్ కూడా బాధ్యుడని ఆ వ్యక్తి ఆరోపించాడు. హైకోర్టు ద్వారా షోయబ్ కు ఇటీవలే పాస్ పోర్టు అందింది. అది అందీ అందగానే సానియా, షోయబ్ లపై కేసు నమోదైంది.