హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు రంగం సిద్ధమైంది. వెండితెర మీద సానియా మీర్జా పాత్రను పోషించేందుకు బాలీవుడ్ నటి పరిణితి చోప్రా సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అవసరమైన టెన్నిస్ టెక్నిక్లను పరిణితి చోప్రా నేర్చుకుంటోందట.
సానియా మీర్జా బయోపిక్ తీసేందుకు, ఆమె దగ్గర నుంచి అన్ని హక్కులను ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన జీవితంపై బయోపిక్ తీస్తే, తన పాత్రలో పరిణితి చోప్రా అయితే బాగుంటుందనే సానియా మిర్జానే అభిప్రాయం వ్యక్తం చేసింది.
అంతేకాదు ఈ ఇద్దరూ మంచి మిత్రులు కూడా. దీంతో స్నేహితురాలిలో పాత్రలో కనిపించేందుకు పరిణితి శిక్షణ తీసుకుంటోంది. భారత అభిమానులకు క్రికెట్ తప్ప మరో ఆట తెలియని పరిస్థితుల్లో సానియా మిర్జా అంతర్జాతీయ టెన్నిస్లో అరుదైన విజయాలను నమోదు చేసింది.
ఈ క్రమంలో ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంతేకాకుండా సానియా జీవితంలో వివాదాలకు కొదువేం లేదు. ముస్లిం మతంలో పుట్టిన డ్రెస్సింగ్పై విమర్శలు వచ్చాయి. ఓ కార్యక్రమంలో జాతీయ జెండా ఉన్న టేబుల్పైకి కాళ్లు పెట్టి కూర్చోవడం వివాదాలకు తావిచ్చింది.
దీనికితోడు బాల్య స్నేహితుడు షోరబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సానియా, తర్వాత కొన్ని రోజులకే దాన్ని రద్దు చేసుకుని పాకిస్తాన్కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత కూడా సానియ మిర్జా భారత్ తరుపున అనేక అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంది.
ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సానియా మిర్జా... మాతృత్వం గురించి కలల కంటోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహమాడిన సానియా.. అక్టోబరులో ఆమె శిశువుకు జన్మనివ్వనుంది. అందుకోసం ఆమె కొన్ని నెలలుగా ఆటకు విరామం తీసుకుంది. తన భర్త, తనకు చెందిన కుటుంబ వారసత్వాలు అందిచ్చేలా ఇరు వంశాల పేరు పెడతామని ఆమె ఇదివరకే చెప్పారు.