టోక్యో: వింబుల్డన్ 2021 మహిళల సింగిల్స్ విజేత, ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీకి టోక్యో ఒలింపిక్స్ 2021లో భారీ షాక్ తగిలింది. టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 48 సారా సోరిబ్స్ (స్పెయిన్)తో జరిగిన లీగ్ మ్యాచ్లో బార్టీ 6-4, 6-3తో వరుస సెట్లలో ఓడిపోయింది. ఒక గంట 34 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచులో బార్టీ తన మార్క్ చూపించలేకపోయింది. ఇటీవల ముగిసిన వింబుల్డన్ 2021లో స్టార్ క్రీడాకారిణులు ఓడించి టైటిల్ నెగ్గిన బార్టీ.. ఒలింపిక్స్లో మాత్రం తన కన్నా చాలా తక్కువ రాంక్ ప్లేయర్ చేతిలో ఓడిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
అచ్చం ఒలింపిక్స్ రింగుల్లానే.. మీరాబాయి చాను చెవి పోగుల వెనుక పెద్ద కథే ఉందే!!
ప్రపంచ నంబర్ 48 సారా సోరిబ్స్ అద్భుత ఆటతో యాష్లే బార్టీని ఓడించింది. రెండు సెట్లలో బార్టీకి స్పెయిన్ క్రీడాకారిణి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. గంట 34 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచులో సారానే పైచేయి సాదిందింది. ఈ ఓటమితో బార్టీ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఈ నెల రెండో వారంలో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7 (4/7), 6-3 తేడాతో బార్టీ వింబుల్డన్ 2021 మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. బార్టీకి అదే తొలి వింబుల్డన్ టైటిల్. అంతకుముందు 2019 ఫ్రెంచ్ ఓపెన్లో బార్టీ విజేతగా నిలిచింది.
మరోవైపు ఒలింపిక్స్లో సింగిల్స్ విభాగం నుంచి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే వైదొలిగాడు. గాయం కారణంగా సింగిల్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ముర్రే తెలిపాడు. అయితే డబుల్స్కు మాత్రం తాను అందుబాటులో ఉంటానని తెలిపాడు. ముర్రే 2012, 2016 ఒలింపిక్స్లో సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. మరో స్టార్ క్రీడాకారిణి నవోమి ఒసాకా ప్రస్తుతం మ్యాచ్ ఆడుతోంది. చైనా ప్లేయర్ సాయ్సాయి హెంగ్తో ఆమె తలపడుతోంది.