హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా జంట ఆస్ట్రేలియన్ ఓపెన్లో సత్తా చాటుతోంది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో హోరాహోరీగా సాగిన పోరులో సానియా, ఇవాన్ దొడిగ్(క్రొయేషియా) జంట 6-4, 3-6, 12-10తో రోహన్ బోపన్న(భారత్), దబ్రోవ్స్కి(కెనడా) జోడీపై విజయం సాధించింది.
రెండో సీడెడ్గా బరిలోకి దిగిన సానియా జోడీకి బోపన్న జోడీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో సానియా జోడీ సెమీ ఫైనల్లో ప్రవేశించింది. తద్వారా ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సానియా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది.

67 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ చేతిలో బోపన్న జోడీ ఓటమి పాలవ్వడంతో అస్ట్రేలియాన్ ఓపెన్లో బోపన్న పోరాటం ముగిసింది. మరో క్వార్టర్స్లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి సమంత స్టోసర్, సామ్ గ్రోత్లతో తలపడనుంది.
ఈ పోరులో విజయం సాధించిన జోడీతో సెమీస్లో సానియా జోడీ తలపడనుంది. ఇదిలా ఉంటే జీల్ దేశాయ్ తన ప్రత్యర్ధి ఐదో సీడ్ సెర్బియా ఓల్గాపై విజయం సాధించి జూనియర్ గర్ల్స్ సింగిల్స్ క్వార్టర్స్లోకి ప్రవేశించింది.