
హైదరాబాద్: రెండు సార్లు గ్రాండ్ స్లామ్ విజేత, వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ అయిన వెనిజులా టెన్నిస్ క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా అనూహ్య పరిణామాల మధ్య బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీ నుంచి మంగళవారం నిష్క్రమించింది.
క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా మంగళవారం సెర్బియా క్రీడాకారిణి అలెక్జాండ్రా క్రునిక్తో రెండో రౌండ్లో గార్బైన్ తలపడింది. అయితే మ్యాచ్ మధ్యలో తీవ్ర వేడిమిని తట్టుకోలేక ఆమె కోర్టులో కుప్పకూలిపోయారు. దీంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు.
దీంతో ఆమెకు చికిత్స అందించగా... తిరిగి మ్యాచ్ని కొనసాగించింది. ఆ తర్వాత 2-1తో సెట్ను గెలుచుకున్న గార్బైన్.. రెండో రౌండ్లో మూడో సెట్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో రెండోసారి అమాంతం కోర్టులోనే కుప్పకూలింది.
ఈసారి కోలుకునే అవకాశం లేకపోవడంతో ఆమె ఓటమిని అంగీకరించింది. దీంతో టోర్నీ నిర్వాహకులు క్రునిక్ను విజేతగా ప్రకటించారు. క్వార్టర్ ఫైనల్లో క్రునిక్ సొరానా కిర్స్టియా లేక అనస్తాసిజా సెవాస్తోవాలో ఎవరో ఒకరితో తలపడనుంది.
ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకుల్లో రెండు ర్యాంకులో ఉన్న ముగురుజా టోర్నీ నుంచి నిష్క్రమించటంతో నెంబర్ వన్ ర్యాంకు సాధించాలన్న ఆమె కల కష్టంగా మారింది. మ్యాచ్ అనంతరం ముగురుజా మాట్లాడుతూ త్వరలో ఆస్ట్రేలియా ఓపెన్ ఉన్న నేపథ్యంలోనే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ నుంచి వైదొలగినట్లు వెల్లడించింది.
జనవరి 15 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది. గతేడాది లండన్ వేదికగా జరిగిన వింబుల్డన్ను ముగురుజా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.