వింబుల్డన్-2019 పురుషుల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకోగా.. మహిళ సింగిల్స్ టైటిల్ గెలిచిన రొమేనియా భామ సిమోనా హలెప్ నాలుగో ర్యాంకుకు దూసుకొచ్చింది. సోమవారం విడుదలైన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకుల జాబితాలో 12,415 పాయింట్లతో జొకోవిచ్ అగ్రస్థానంలో నిలిచాడు.
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ (7,945) మూడు నుంచి రెండో ర్యాంకుకు దూసుకొచ్చాడు. జొకోవిచ్, నాదల్ మధ్య 4,500పాయింట్ల దూరం ఉండడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (7,460) మూడో ర్యాంకుకు చేరాడు. డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా; 4,595) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. సెమీస్ చేరిన బటిస్టా అగట్ (స్పెయిన్) తొమ్మిది స్థానాలను మెరుగుపరుచుకొని 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక భారత అగ్రశేణి ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 89వ ర్యాంకులో ఉన్నాడు.
Five #Wimbledon crowns, won within a single decade.
— Wimbledon (@Wimbledon) July 15, 2019
An all-time great. @DjokerNole 👏 pic.twitter.com/A7HhCJ42CH
వింబుల్డన్ టైటిల్ గెలిచిన సిమోనా హలెప్ (5,933) మూడు స్థానాలు మెరుగు పరుచుకొని ఏడు నుంచి నాలుగో ర్యాంకుకు దూసుకొచ్చింది. వింబుల్డన్ టోర్నీ ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లే బార్టీ 6,605 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాక (6,257), కరోలినా ప్లిస్కోవా (6,055) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ 9వ ర్యాంకుకు చేరుకుంది.