ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్యం సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో తడబడిన భారత పురుషుల జట్టు.. చైనీస్ తైపీ టీం చేతిలో ఓటమి పాలైంది. దీంతో మూడో స్థానానికే భారత జట్టు పరిమితమైంది. అనుభవం ఉన్న ప్లేయర్లతోపాటు యంగ్ ప్లేయర్లకు కూడా ఈసారి టేబుల్ టెన్నిస్ టీంలో చోటు దక్కింది.
దీంతో భారత జట్టుపై అంచనాలు బాగా నిలిచాయి. టీంలోని శరత్ కమల్, హర్మీద్ దేశాయి, సాథియాన్ జ్ఞానశేఖరన్ ముగ్గురూ ఓడిపోవడంతో చైనీస్ తైపీ చేతిలో 3-0తో భారత జట్టు ఓడిపోయింది. రెండు సెమీఫైనల్ మ్యాచుల్లో ఓడిన జట్లకు కాంస్య పతకాలను అందజేశారు. ఈ మ్యాచ్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ శరత్ కమల్ తొలి గేమ్ ఆడాడు. కానీ చైనా ప్లేయర్ చాంగ్ చి యువాన్ చేతిలో 3-0 తేడాతో శరత్ ఓడిపోయాడు.

ఇక రెండో గేమ్లో సాథియాన్ జ్ఞానశేఖరన్ కూడా 3-0తో ఓటమి పాలయ్యాడు. అతన్ని టోక్యో ఒలింపిక్స్లో డబుల్స్ విభాగంలో కాంస్యం నెగ్గిన లిన్ యూన్ జూ ఓడించాడు. తప్పక గెలవాల్సిన మూడో గేమ్లో హర్మీత్ దేశాయి గట్టి పోరాట పటిమ కనబరిచాడు.అయితే కావో చెంగ్ జూపై మాత్రం హర్మీత్ పైచేయి సాధించలేకపోయాడు. చివరకు 3-1 తేడాతో ఓటమి చవిచూశాడు.
భారత జట్టులో కనీసం ఒక పాయింట్ అయినా సాధించింది హర్మీత్ మాత్రమే కావడం గమనార్హం. మిగతా ఇద్దరూ కనీసం ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. ఈ టోర్నీలో సెమీస్ చేరడంతోనే భారత్కు కాంస్యం ఖాయమైంది. అయితే శరత్ వంటి స్టార్ ప్లేయర్ ఉండటంతో భారత జట్టు సులభంగా ఫైనల్ చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చివరకు భారత్ కేవలం కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా కాంస్యం సాధించిన భారత జట్టుకు భారతీయులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.