
జకార్తా: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నజరానాల వర్షం కురుస్తోంది. తాజాగా రెజ్లింగ్లో భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించిన హరియాణా క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3కోట్ల నజరానాను అందజేయనున్నట్లు ప్రకటించింది. భాజపా నేత, హరియాణా క్రీడల శాఖ మంత్రి అనిల్ విజ్ సోమవారం ట్విటర్ ద్వారా వినేశ్ను అభినందిస్తూ నజరానా ప్రకటించారు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
భారీ నజరానాతో పాటు ఉద్యోగరీత్యా.. సివిల్ సర్వీసెస్ లేదా పోలీస్ సర్వీస్లో ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే షూటింగ్లో రజత పతకం సాధించిన లక్షయ్ షెరాన్కు రూ.1.5కోట్లు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే హరియాణా ప్రభుత్వం రెజ్లర్ భజ్రంగ్ పునియాకు రూ.3కోట్ల నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెజ్లింగ్లో మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫోగాట్ స్వర్ణం సాధించింది.
దీంతో ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన తొలి మహిళా రెజ్లర్గా వినేశ్ చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్లో జపాన్కు చెందిన ఇరి యుకిపై 6-2తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఆసియా గేమ్స్లో ఓ మహిళా రెజ్లర్ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. తద్వారా ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధించిన తొలి మహిళా రెజ్లర్గా వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించింది. గతంలో కామన్వెల్త్ గేమ్స్ ఆమె రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది.
మొత్తంగా చూస్తే ఆసియా గేమ్స్లో భారత్కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. ఈ ఆసియా గేమ్స్లో మంగళవారం ఉదయం నాటికి భారత్ ఏడు పతకాలు సాధించింది. షూటింగ్లో 5 సాధించి.. మిగిలిన రెండింటిని రెజ్లింగ్లోనే సాధించింది. రెజ్లింగ్లో సాధించిన రెండూ స్వర్ణం కావడం విశేషం. భజరంగ్ పూనియా తొలి రోజు స్వర్ణాన్ని దక్కించుకోగా, రెండో స్వర్ణాన్ని సోమవారం వినేశ్ ఫోగాట్ సొంతం చేసుకుంది.