
జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్లో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి అంకిత రైనా సెమీస్ చేరింది. దీంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖరారైంది.
ఆసియా గేమ్స్లో భాగంగా బుధవారం అంకిత రైనా క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్ క్రీడాకారిణి వాంగ్ చాంగ్తో తలపడింది. ఇద్దరి మధ్య ఈ పోరు ఆసక్తికరంగా సాగింది. ఒకానొక దశలో తొలిసెట్లో 1-4తో అంకిత బాగా వెనుకబడింది. ఆ సమయంలో అంకిత ఒత్తిడిని అధిగమించి అనూహ్యంగా పుంజుకుంది.
దీంతో 4-4తో తొలి సెట్ను సమం చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా 6-4తో మొదటి సెట్ను సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్లోనూ అంకిత అదే జోరు కొనసాగించి 6-1తో ప్రత్యర్థిపై విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో ఆసియా క్రీడల్లో అంకితకు పతకం ఖాయమైంది.
25 ఏళ్ల అంకిత రైనా గుజరాత్కు చెందిన క్రీడాకారిణి కావడం విశేషం. మరోవైపు పురుషుల సింగిల్స్లో రామ్కుమార్ రామ్నాథన్ 6-3, 4-6, 3-6 తేడాతో ఓడిపోయి తుది 16లో చోటు దక్కించుకోలేకపోయాడు.