సింధు, సైనా దూకుడు:
బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21-14, 21-7తో సయాక తకహాషి (జపాన్)పై గెలుపొందింది. సింధు కేవలం 28 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. సింధు దాడికి ఎక్కడాకూడా తకహాషి నిలవలేకపోయింది. ఏడో సీడ్ సైనా 12-21, 21-11, 21-17తో హాన్ యువె (చైనా)పై విజయం సాధించింది. మొదట గేమ్ కోల్పోయిన సైనా.. అనంతరం శ్రమించి వరుసగా రెండు గేముల్లో సత్తా చాటింది.
తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఔట్:
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 16-21, 20-22తో 51వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావితొ (ఇండోనేసియా) చేతిలో ఓటమిని ఎదుర్కొన్నాడు. 44 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. రుస్తావిటో చేతిలో శ్రీకాంత్కిది రెండో పరాజయం. ఇక ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 21-13, 17-21, 21-18తో కజుమసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు.
డబుల్స్లో మిశ్రమ ఫలితాలు:
మహిళల డబుల్స్, పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అన్ని జోడీలు పరాజయం పాలయ్యాయి. జక్కంపూడి మేఘన-పూర్వీషా రామ్ (భారత్) 13-21, 16-21తో జాంగ్ కొల్ఫాన్-రవింద (థాయ్లాండ్) చేతిలో.. దండు పూజ-సంజన సంతోష్ (భారత్) 13-21, 21-12, 12-21తో ప్రమోదిక-కవిది (శ్రీలంక) చేతిలో.. అపర్ణ బాలన్-శ్రుతి (భారత్) 12-21, 10-21తో యుజియా జిన్-మింగ్ హుయ్ లిమ్ (సింగపూర్) చేతిలో ఓటమిని చవిచూశారు. ఎంఆర్ అర్జున్-శ్లోక్ రామచంద్రన్ (భారత్) 18-21, 15-21తో హి జిటింగ్-తాన్ కియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది.