
లండన్: వింబుల్డన్ 2021 మహిళల సింగిల్స్ విజేతగా ప్రపంచ నంబర్వన్, ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ నిలిచింది. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో బార్టీ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7 (4/7), 6-3 తేడాతో విజయం సాధించింది. దాంతో బార్టీ ఖాతాలో రెండో టైటిల్ చేరింది. ఇది బార్టీకి తొలి వింబుల్డన్ టైటిల్. అంతకుముందు 2019 ఫ్రెంచ్ ఓపెన్లో ఆష్లే బార్టీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఇదే ఆమెకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.
తొలి సెట్లో ఆష్లే బార్టీ అలవోకగా గెలవగా.. రెండో సెట్లో కరోలినా ప్లిస్కోవా దూకుడు ప్రదర్శించింది. టైబ్రేకర్కు దారి తీసిన రెండో సెట్ను ప్లిస్కోవా కైవసం చేసుకుంది. దాంతో మూడో సెట్ అనివార్యం కాగా.. బార్టీ ఆధిపత్యం చెలాయించింది. ఎక్కడా కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకండా.. సెట్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుని తొలి వింబుల్డన్ టైటిల్ను కైవసం చేసుకుంది. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధిద్దామనుకున్న ప్లిస్కోవా ఆశలు నెరవేరలేదు. ఇక 1980 తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా వింబుల్డన్ టైటిల్ను గెలవలేదు. ఆ రికార్డును బార్టీ బ్రేక్ చేసింది.
వింబుల్డన్ 2021 మహిళల సింగిల్స్ విజేత అయిన ఆష్లే బార్టీకి ట్రోఫీతో పాటు 2.4 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ కరోలినా ప్లిస్కోవా ట్రోఫీతో పాటుగా 1.2 మిలియన్ డాలర్లు గెలుచుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా 5-7, 6-4, 6-4తో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై గెలుపొందగా.. ఆష్లే బార్టీ 6-3, 7-6 (7/3)తో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై గెలిచింది.
ఆదివారం జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో నోవాక్ జొకోవిచ్, మాటియో బెరెటిని తలపడనున్నారు. పురుషుల సింగిల్స్లో ఛైర్ అంపైర్గా తొలిసారి ఓ మహిళ ఉండనుంది. మరిజా సిసాక్ 2012 నుంచి డబ్ల్యూటీఏ ఎలైట్ టీమ్లో సభ్యురాలిగా ఉంటున్నారు. ఆమె గోల్డ్ బ్యాడ్జ్ ఛైర్ అంపైర్. 2014 వింబుల్డన్ మహిళల సింగిల్స్లో, అనంతరం గత మూడేళ్లుగా మహిళల డబుల్స్ ఫైనల్లో ఛైర్ అంపైర్గా వ్యవహరిస్తున్నారు.