
లండన్: వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో ఈ సారి కొత్త ఛాంపియన్ రాబోతుంది. సెమీఫైనల్లో గెలిచిన ప్రపంచ నంబర్వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా).. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. వింబుల్డన్లో ఫైనల్కు చేరడం వీరిద్దరికీ ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈసారి సరికొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్లిస్కోవా 5-7, 6-4, 6-4తో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై గెలుపొందగా.. బార్టీ 6-3, 7-6 (7/3)తో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై గెలిచింది.
మ్యాచ్ను ఘనంగా ఆరంభించిన ఆష్లే బార్టీ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కెర్బర్ తొలి సర్వీసునే బార్టీ బ్రేక్ చేసింది. ఆధిపత్యాన్ని కొనసాగించిన బార్టీ.. 34 నిమిషాల్లోనే తొలి సెట్ను చేజిక్కించుకుంది. అయితే కెర్బర్ పుంజుకుని ప్రతిఘటించడంతో రెండో సెట్ హోరాహోరీగా సాగింది. ఆరంభంలోనే బ్రేక్ సాధించిన కెర్బర్.. ఓ దశలో 4-1తో నిలవడంతో సెట్ చేజిక్కించుకునేలా కనిపించింది. అయితే బార్టీ చెలరేగడంతో సెట్ను టేబ్రేక్కు తీసుకెళ్లింది. టైబ్రేక్లో పైచేయి సాధించి సెట్తో పాటు మ్యాచ్ను గెలుచుకుంది. మ్యాచ్లో బార్టీ 8 ఏస్లు, 38 విన్నర్లు కొట్టింది. కెర్బర్ 23 అనవసర తప్పిదాలు చేసింది.
ప్లిస్కోవా, సబలెంకా మధ్య జరిగిన మ్యాచ్లో ఏస్ల వర్షం కురిసింది. మొత్తం 31 ఏస్లు నమోదవ్వగా.. అందులో సబలెంకా 18, ప్లిస్కోవా 13 సంధించింది. గంటా 53 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ హోరాహోరీగా సాగింది. 11వ గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకున్న సబలెంకా.. ఆ తర్వాతి గేమ్లో ప్లిస్కోవా సర్వీస్ను బ్రేక్ చేసి తొలి సెట్ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో సబలెంకా అనవసర తప్పిదాలు చేసింది. దీంతో ఐదో గేమ్లో సబలెంకా సర్వీస్ను బ్రేక్ చేసిన ప్లిస్కోవా అదే దూకుడుతో సెట్ను సొంతం చేసుకుంది. ఇక మూడో సెట్లోనూ అద్భుత ఆట కనబర్చిన ప్లిస్కోవా మ్యాచును చేజిక్కించుకుంది.