
మాడ్రిడ్: బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను చేజిక్కించుకుంది. రెండు వారాల క్రితం గాయం కారణంగా ఈ టోర్నీలో ఆడే విషయంలో సందిగ్ధత వ్యక్తం చేసి.. చివరి నిమిషంలో బరిలో నిలిచిన సబలెంకా చివరకు విజేతగా అవతరించింది. మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా)కి షాకిచ్చి.. ఎర్రమట్టి కోర్టులో తొలి డబ్ల్యూటీఏ టైటిల్ను ఖాతాలో వేసుకుంది.
హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ అరీనా సబలెంకా 6-0, 3-6, 6-4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీపై విజయం సాధించింది. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో బార్టీ ఓడిపోవడం ఇదే తొలిసారి. యారా క్లాసిక్ వ్యాలీ ఓపెన్, మయామి ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్ టోర్నీలలో ఫైనల్ చేరిన బార్టీ టైటిల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సబలెంకా కెరీర్లో ఇది 10వ సింగిల్స్ టైటిల్.
తొలి సెట్లో చెలరేగిన సబలెంకా ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ బార్టీ పుంజుకుని రెండో రెండో సెట్ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో పోరు హోరాహోరీగా సాగింది. కానీ కీలక సమయాల్లో పుంజుకున్న సబలెంక.. సెట్తో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది. ఈ పోరులో 9 ఏస్లు సంధించిన సబలెంకా.. అయిదు సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది.
'రెండు వారాల క్రితం స్టుట్గార్ట్ ఓపెన్ ఫైనల్లో గాయపడ్డాను. కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దాంతో మాడ్రిడ్ ఓపెన్ నుంచి వైదొలగాలని భావించాను. కానీ నా వైద్య బృందం నాలుగు రోజుల్లో నన్ను కోలుకునేలా చేసింది. ఇప్పుడు మీ ముందర ట్రోఫీతో నిల్చున్నాను' అని క్లే కోర్టులపై తొలిసారి టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల సబలెంకా పేర్కొంద. విజేతగా నిలిచన సబలెంకాకు 315160 యూరోల ప్రైజ్మనీ (రూ. 2 కోట్ల 81 లక్షలు)తో పాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, షాంపేన్ బాటిల్ లభించాయి.