
న్యూయార్క్: ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం.. మరోవైపు వైదొలిగిన స్టార్ క్రీడాకారులు.. ఇక ఖాళీ స్టాండ్స్.. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో యుఎస్ ఓపెన్ షురూ అయింది. సోమవారం డిఫెండింగ్ ఛాంపియన్లు లేకుండానే టోర్నీ మొదలైంది. తొలి రోజు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 2016 చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) అలవోక విజయాలతో శుభారంభం చేసి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 2016 రన్నరప్ ప్లిస్కోవా 6-4, 6-0తో అనెహెలినా కలినినా (ఆర్మేనియా)ను 63 నిమిషాల్లో ఓడించింది. ఈ మ్యాచ్లో ఏడు ఏస్లు కొట్టిన ఈ చెక్ అమ్మాయి.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది. రెండో సెట్లో ఆమె కలినినాకు ఒక్క గేమ్ కూడా గెలిచే అవకాశాన్ని ఇవ్వలేదు. పదిహేడో సీడ్ కెర్బర్ 6-4, 6-4తో టామ్జనోవిచ్ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో ఓడించింది. ఈ మ్యాచ్లో 15 విన్నర్లు కొట్టిన కెర్బర్..అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది.
మ్లదనోవిచ్ (ఫ్రాన్స్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఆమె 7-5, 6-2తో బాప్టిస్టె (అమెరికా)ను ఓడించింది. వోండ్రుసోవా 6-1, 6-4తో మినెన్ (జర్మనీ)పై గెలిచి రెండోరౌండ్ చేరగా.. క్విటోవా (చెక్ రిపబ్లిక్), గ్రెచెవా (రష్యా), గర్సియా (ఫ్రాన్స్), లొండెరొ (అర్జెంటీనా) ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్లో బోర్నా కొరిచ్ (క్రొయేషియా) తొలి రౌండ్ దాటాడు. అతను 7-5, 6-3, 6-1తో అండుజర్ (స్పెయిన్)ను ఓడించాడు. 18వ సీడ్ లాజోవిచ్ (సెర్బియా) 1-6, 6-4, 4-6, 4-6తో జెరాసిమోవ్ (బెలారస్) చేతిలో ఓడిపోయాడు.
ఈసారి క్వాలిఫయింగ్తో పాటు మిక్స్డ్ డబుల్స్ను తీసేశారు. పురుషులు, మహిళల డబుల్స్లో పాల్గొనే వారి సంఖ్యను సగానికి తగ్గించారు. ఇక మొత్తం ప్రైజ్మనీ తగ్గిపోయింది. సింగిల్స్ విజేతకు 28 కోట్లకు బదులు రూ.22 కోట్లే ఇవ్వనున్నారు. ప్రేక్షకులకు ప్రవేశం లేకపోవడంతో గ్యాలరీలు అన్ని ఖాళీగా ఉన్నాయి.