
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తాను వైదొలగతున్నట్లు మాజీ వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు, మూడు గ్రాండ్ స్లామ్స్ విజేత ఆండీ ముర్రే ప్రకటించాడు. తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముర్రే పేర్కొన్నాడు.
ఏటీపీ ర్యాంకుల్లో 16వ స్ధానంలో కొనసాగుతున్న ఆండీ ముర్రే గత కొంత కాలంగా తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ సీజన్ ఓపెనింగ్లో భాగంగా జరుగుతున్న ఏటీపీ 250 టోర్నమెంట్ అయిన బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ నుంచి కూడా ముర్రే అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
గురువారం ముర్రే బ్రిస్బేన్ నుంచి లండన్ వేదికగా మెల్బోర్న్కు పయనమియ్యాడు. ఈ సందర్భంగా ముర్రే మాట్లాడుతూ 'ఈ ఏడాది మెల్బోర్న్లో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడటం లేదు. టోర్నీలో పాల్గొనేందుకు ఇంకా సిద్ధంగా లేను. త్వరలోనే ఇంటికి పయనమవుతున్నా. తిరిగి కోర్టులో అడుగుపెట్టాలని నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు' అని అన్నాడు.
30 ఏళ్ల ముర్రే త్వరలోనే గాయానికి సర్జీరీ చేయించుకోనున్నాడు. అయితే ముర్రే తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ డైరెక్టర్ గ్రెగ్ టైలీ మాట్లాడుతూ 'ముర్రే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అయినా సరే అతడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం" అని అన్నాడు.
'గాయం కారణంగా ప్రస్తుతం ఆండీ ముర్రే కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాడని, అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనేందుకు అతడు చేసిన ప్రయత్నాలు అభినందనీయం. ముర్రేకి టెన్నిస్ అంటే ఎంతో ప్రాణమని, దాని కోసం అతడు ఏమైనా చేస్తాడు' అని చెప్పుకొచ్చాడు.
గతేడాది వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో శామ్ క్వర్రీ చేతిలో ఓటమి పాలైన తర్వాత ముర్రే ఒక్క అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో కూడా పాల్గొనలేదు. గత నెలలో అబుదాబిలో జరిగిన ముబాదల టెన్నిస్ ఛాంపియన్షిప్లో భాగంగా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్లో మాత్రమే పాల్గొన్నాడు.
2016 ముర్రేకి ఎంతగానో కలిసొచ్చిందియ తన కెరీర్లో రెండో వింబుల్డన్ టైటిల్ను 2016లోనే గెలిచాడు. అంతేకాదు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ పైనల్స్కు అర్హత సాధించాడు. 2016ను వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుతో ముగించాడు.