న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్లు రోహన్ బోపన్న, సానియా మీర్జాలకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చురకలు అంటించింది. టోక్యో ఒలింపిక్స్ 2021 అర్హతకు సంబంధించి ఐటా తప్పుదోవ పట్టించిందని బోపన్న విమర్శిస్తుండగా.. అతడికి మరో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మద్దతుగా నిలిచింది. దీనిపై ఐటా ఘాటుగా స్పందించింది. వాళ్లిద్దరూ ప్రపంచ టెన్నిస్ సమాఖ్య రూల్స్ పుస్తకంలో ఒలింపిక్స్ అర్హత నిబంధనలు చదువుకోవాలని సూచించింది. జూన్ 23 నుంచి జపాన్ వేదికగా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.
టోక్యో ఒలింపిక్స్ అర్హతకు సంబంధించి రోహన్ బోపన్న, ఐటా మధ్య వివాదం జరుగుతోంది. కంబైన్డ్ ర్యాంకింగ్లో దివిజ్ శరణ్తో కలిసి టోక్యోకు అర్హత సాధించలేకపోయిన బోపన్నను సుమిత్ నగాల్తో కలిసి డబుల్స్ ఆడేందుకు అనుమతించాలని ప్రపంచ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)ను ఐటా కోరింది. దీంతో ఈ వివాదం మొదలైంది. ఒకసారి జట్టు ప్రతిపాదన చేశాక మార్పు చేర్పులకు ఎలాంటి అవకాశం లేదని ఐటీఎఫ్ ముందే చెప్పినా.. ఐటా మాత్రం ఇప్పటిదాకా అవకాశం ఉందని చెబుతూ తప్పుదోవ పట్టించిందని బోపన్న విమర్శలు చేశాడు. బోపన్న తానుగా ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోవడం వల్ల అతడిని టోక్యో పంపేందుకు సాయం చేస్తున్నామని ఐటా బదులిచ్చింది.
'నాతో పాటు సుమిత్కు ఒలింపిక్స్లో పోటీపడేందుకు అవకాశం ఇవ్వడానికి ప్రపంచ టెన్నిస్ సమాఖ్య నిరాకరించింది. జూన్ 22న ప్రతిపాదనలకు అర్హత గడువు ముగిసినందున ఇప్పటికే అర్హత సాధించిన ఎవరైనా గాయపడడమో.. లేక అనారోగ్యంతో వైదొలిగితేనో మాత్రమే కొత్త ఎంట్రీలకు అవకాశం ఉంటుందని ఐటీఎఫ్ చెప్పింది. మరోవైపు అఖిల భారత టెన్నిస్ సంఘం మాత్రం మాకు ఇంకా అవకాశం ఉందంటూ.. క్రీడాకారులే కాక ప్రభుత్వాన్ని, మీడియాను తప్పుదోవ పట్టించింది' అని రోహన్ బోపన్న తాజాగా ట్వీట్ చేశాడు.
రోహన్ బోపన్న ట్వీట్పై సానియా మీర్జా స్పందించింది. 'ఇది నిజమే అయితే అర్ధరహితం, సిగ్గుచేటు. సుమిత్తో పాటు మీ పేరు ఇచ్చామనడం వల్ల మనిద్దరం కలిసి బరిలో దిగే అవకాశం కోల్పోయాం. మనిద్దరం అనుకున్నట్లుగా ఆడితే.. మిక్స్డ్ డబుల్స్లో పతకం సాధించేవాళ్లం' అని సానియా ట్వీట్ చేసింది. వీటిపై ఐటా స్పందిస్తూ... 'బోపన్న, సానియా చేసిన వ్యాఖ్యలు సరైనవి లేవు. వాళ్లు ఐటీఎఫ్ రూల్స్ పుస్తకంలో ఒలింపిక్స్ అర్హత నిబంధనలను ఒకసారి చదువుకోవాలి. బోపన్న నేరుగా అర్హత సాధించకపోవడం వల్ల అతడు ఒలింపిక్స్కు వెళ్లేందుకు మేం సాయం చేశాం' అని పేర్కొంది.