భారత్ టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్పై అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) తీవ్ర ఆగ్రహంతో ఉంది. గాయమని అబద్ధం చెప్పి డేవిస్ కప్కు సుమిత్ నగాల్ దూరమయ్యాడని ఏఐటీఏ భావిస్తోంది. ఇటీవల స్వీడన్తో జరిగిన డేవిస్ కప్ గ్రూప్-1 టై పోరుకు నగాల్ గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు డేవిస్ కప్ పాకిస్థాన్ పోరుకు కూడా దూరమయ్యాడు.
అయితే సింగిల్స్ టాప్ ప్లేయర్లు సుమిత్ నగాల్, యుకి బాంబ్రి దూరమవ్వడంతో స్వీడన్తో జరిగిన పోరులో డబుల్స్ ఆటగాళ్లు శ్రీరామ్ బాలాజీ, రామ్కుమార్ రామనాథన్ సింగిల్స్లో ఆడాల్సి వచ్చింది. ఇది జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. స్వీడన్ చేతిలో ఇండియా 0-4తో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

సింగిల్స్తో పాటు డబుల్స్లో బాలాజి, రామ్కుమార్ ఓటమి చవిచూశారు. ఒక్క సెట్ కూడా గెలవలేకపోయారు. ఇక నామమాత్రపు రివర్స్ సింగిల్స్లోనూ సిద్ధార్థ్ ఓడటంతో భారత్ 0-4తో నిలిచింది. దీంతో నిరూపయోగంగా ఉన్న చివరి రివర్స్ సింగిల్స్ మ్యాచ్ను నిర్వహించలేదు. అయితే గత వారం గాయం అని చెప్పిన సుమిత్ నగాల్.. ప్రస్తుతం చైనాలో ఏటీపీ టోర్నీకి సిద్ధమవ్వడం గమనార్హం.
ఈ విషయం ఏఐటీఏకీ తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. దీని గురించి ఏఐటీఏ ప్రధాన కార్యదర్శి అనిల్ ధూపర్ స్పందించాడు. వెన్ను నొప్పి కారణంతో నగాల్ డేవిస్ కప్ను ఆడలేదని, కానీ ఇప్పుడు చైనా ఆడటానికి అతను సిద్ధమయ్యాడని అన్నాడు. '' సుమిత్ నగాల్, యుకి బాండ్రి ఆడి ఉంటే మన అవకాశాలు మెరుగ్గా ఉండేవి. అయితే నగాల్ తనకు వెన్ను నొప్పి అని చెప్పాడు. కానీ ఇప్పుడు అతను చైనాలో ఆడబోతున్నాడు. తన సమస్య ఇంతలోనే తీరిపోయిందా'' అని అనిల్ ధూపర్ ప్రశ్నించాడు. డేవిస్ కప్ అనేది టోర్నమెంట్ కాదని దేశానికి ప్రాతినిథ్యం వహించడమని పేర్కొన్నాడు.