హైదరాబాద్: తనకు సరైన భాగస్వామిని ఎంపికచేయలేదన్న కారణంతో ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ నుంచి వైదొలిగిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్పై వేటు పడింది. సెర్బియాతో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్లో పాల్గొనే భారత జట్టులోకి అతడిని ఎంపిక చేయలేదు.
డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ సెప్టెంబరు 14 నుంచి 16 వరకు సెర్బియాలో జరగనుంది. సెర్బియాతో మ్యాచ్ కోసం రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్లతో కూడిన ఐదుగురు సభ్యుల భారత జట్టును ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది.
సింగిల్స్ ఆటగాళ్లుగా యూకీ భాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్, ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ బరిలో ఉంటారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన జంట బోపన్న-దివిజ్ డబుల్స్ మ్యాచ్ ఆడుతుంది. తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. జట్టుకు మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా, జీషాన్ అలీ కోచ్గా వ్యవహరిస్తారు.
What a gesture from Rohan Bopanna!
— The Bridge (@TheBridge_IN) August 24, 2018
👏👏👏 pic.twitter.com/Wa19nnLnpM
గత ఏప్రిల్లో చైనాతో జరిగిన మ్యాచ్లో నెగ్గి డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (43) సాధించిన ప్లేయర్గా లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
డేవిస్ కప్ జట్టు:
యూకీ భాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్, ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, రోహాన్ బోపన్న, దివిజ్ శరణ్, సాకేత్ మైనేని