
అందులో భాగంగా అధికారులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు కలిసి ఐదు అంశాల ప్రణాళిక రూపొందించారు. అందులో ఆర్టీసీ బస్సుల షటిల్ సర్వీసుల ప్రారంభానికి నెల రోజుల ముందు దీనికి పునాదులు పడ్డాయి. ఐటీ కారిడార్లో నిత్యం సంచరించేందుకు పెట్రోలింగ్ వాహనాలు సమకూరాయి. రాష్ట్ర డిజిపి బి.ప్రసాదరావు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, అదనపు డీజీ (సిఐడి) కృష్ణప్రసాద్, ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్ వీటిని మాదాపూర్లో బుధవారం ప్రారంభించారు.
ఐల్యాబ్స్, ఐటీ రహేజా, ఐవీ టెక్, వాల్యూ ల్యాబ్స్ ఐదు వాహనాలను సైబరాబాద్ పోలీసులకు అందజేశాయి. మహిళల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన లఘుచిత్రాల్లో 'అభయ', 'నిర్భయ' సంఘటనలను పాత్రలుగా మలిచారు.
ఐటీ మహిళా ఫోరం ఏర్పాటు
హైటెక్ సిటీలో ఆ మధ్య ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కారులో కిడ్నాప్ చేసి దారుణంగా ఆమెపై అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన ఐటి ఉద్యోగినిని అభయగా పిలుస్తున్నారు. ఈ అభయ సంఘటన తర్వాత ఐటీ కారిడార్ మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో పోలీసులు అభయ యాక్షన్ ప్లాన్ను రూపొందించి అమలు చేస్తుండగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులంతా వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
ప్రైవేటు రవాణాను ఉపయోగించినప్పుడు, రాత్రి పూట విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. మహిళలు ప్రయాణించే వాహనంలో ఎవరైనా ఆకతాయిలు ఉంటే ఎలా గుణపాఠం చెప్పాలన్న చిట్కాలను తెలియజేస్తారు. నెల లేక వారంలో ఒకసారి ఫోరం సమావేశమై తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి సమీక్షిస్తుంది. మహిళా చట్టాలకు సంబంధించి వీరికి అవగాహన కల్పిస్తారు. దీనికి చైర్పర్సన్గా నేరపరిశోధన విభాగం అదనపు ఉపకమిషనర్ జి.జానకీషర్మిల వ్యవహరిస్తారు.
హెల్ప్లైన్ ఏర్పాటు
"ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం అన్ని వేళలా శ్రేయస్కరమని చెప్పలేం. ఆపదల నుంచి బయటపడేందుకు మహిళలు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం మంచిది. పెప్పర్ స్ప్రే బ్యాగ్లో ఉండేలా చూసుకోవాలి" అని డిజిపి ప్రసాదరావు అన్నారు.
కాగా, "ఆపదలో ఉంటే డయల్ 100కు గానీ, సైబరాబాద్ మహిళా హెల్ప్లైన్ 9494731100 నంబర్కు గానీ ఫోన్ చేయాలి. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు దాని రిజిస్ట్రేషన్ నంబర్ను కుటుంబీకులకు, స్నేహితులకు ఎస్ఎంఎస్ చేయాలి. ఇందుకోసం వెబ్సైట్లలో ఉన్న వివిధ అప్లికేషన్స్ను ఉపయోగించుకోవాలి" అని ఆయన వివరించారు.