
డర్హమ్: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. చెస్టర్-లే-స్ట్రీట్ మైదానంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ కాసేపటి క్రితం ఆరంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో.. రోహిత్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు ఫస్ట్క్లాస్ హోదాను కూడా ఇచ్చారు. డర్హమ్ క్రికెట్స్ యూట్యూబ్ ఛానెల్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ప్రాక్టీస్ మ్యాచులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. పేసర్లు మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్రాంతి తీసుకున్నారు. రిషబ్ పంత్ గైర్హాజరీలో ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. కొవిడ్-19 పాజిటివ్గా తేలిన పంత్ లండన్లో సన్నిహితుల ఇంట్లో 10 రోజులు ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. అయితే వేగంగా కోలుకుంటున్న పంత్.. డర్హమ్లో బయో బబుల్లో ఇంకా చేరలేదు. బుధవారం డర్హమ్లో ఏర్పాటు చేసిన టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్లో అతను చేరనున్నాడు.
కౌంటీ సెలెక్ట్ ఎలెవన్తో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్పైనే అందరి కళ్లు ఉన్నాయి. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న మయాంక్.. భారత ఇన్నింగ్స్ను ఆరంభించాడు. శుభ్మన్ గిల్ గైర్హాజరీలో తొలి టెస్టులో రోహిత్ శర్మతో కలిసి మయాంక్ ఓపెనర్గా దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడి అటను జట్టు యాజమాన్యం నిశితంగా పరిశీలించనుంది. ఉమేష్, సిరాజ్, శార్దూల్, అక్షర్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. మరోవైపు కౌంటీ ఎలెవన్ జట్టులో ఎక్కువ మంది యువకులే. ఒక్క జేమ్స్ బ్రేసీ మాత్రమే ప్రస్తుతం ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వార్విక్షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ టీమ్కు నాయకత్వం వహిస్తున్నాడు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పూజారా, హనుమా విహారి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.