
ముంబై: మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ను ఓ వ్యాపారవేత్త ఓడించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ వ్యాపారవేత్త గెలవడం వెనుక దాగున్న అసలు నిజాలు బయటపడ్డాయి. అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ పేరిట ఆనంద్ ఆదివారం పలువురు ప్రముఖులతో చెస్ పోటీల్లో తలపడిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్, రితేష్ దేశ్ముఖ్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయనతో తలపడ్డారు. జిరోధా సంస్థ సహ యజమాని నిఖిల్ కామత్ సైతం పోటీపడి ఆనంద్ను ఓడించారు.
విశ్వనాథన్ ఆనంద్ను నిఖిల్ కామత్ ఓడించడం చాలా మందిని షాక్కు గురి చేసిందనే చెప్పాలి. కామత్ మోసం చేసి గెలిచినట్లు వార్తలు రావడంతో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) కార్యదర్శి భరత్ చౌహన్ స్పందించారు. ఛారిటీ పోటీల్లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదనన్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ కామత్ సైతం ట్విటర్లో ఓ పోస్టు చేసి తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. అందరూ తాను ఆనంద్పై గెలిచానని అనుకుంటున్నారని.. గేమ్ను చూస్తున్న నిపుణులు, కంప్యూటర్ల సాయంతో ఆడి తాను గెలిచానని వివరణ ఇచ్చారు.
'నేను చిన్నప్పుడు చెస్ నేర్చుకునే రోజుల్లో విశ్వనాథ్ ఆనంద్తో ఆడాలనుకున్నా. అది ఇప్పుడు నిజమైంది. అక్షయపాత్ర సంస్థ వారు ఆనంద్తో కలిసి ఛారిటీ కోసం చెస్ పోటీలు నిర్వహించడంతో నాకు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే నేను నిజంగానే ఆనంద్ను చెస్లో ఓడించానని చాలా మంది అనుకుంటున్నారు. అది తప్పు. అదెలా ఉందంటే నేను నిద్రలేచిన వెంటనే ఉసేన్ బోల్ట్తో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీపడి గెలిచినట్లుగా ఉంది' అని నిఖిల్ కామత్ పోస్టు చేశారు.
'ఆనంద్ సర్తో ఆడిన గేమ్లో నేను కొంత మంది వ్యక్తులు, కంప్యూటర్ నుంచి సహాయం పొందాను. ఈ పోటీలు కేవలం సంతోషం, ఫండ్ రైజింగ్ కోసమే నిర్వహించారు. అయితే నేను చేసిన పనితో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని ఊహించలేదు. అందుకు క్షమాపణలు' అని నిఖిల్ కామత్ ట్వీట్లో పేర్కొన్నారు. అనంతరం దీనిపై స్పందించిన విశ్వనాథ్ ఆనంద్.. ఆదివారం పలు రంగాల ప్రముఖులతో ఆడటమనేది ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించడానికి. ఆటలోని నియమాలు పాటిస్తూ ఆడటం చాలా సంతోషంగా అనిపించింది. ఆటలో ఎదురైన పరిస్థితులను బట్టే నేను ఆడాను. ఇతరుల నుంచి కూడా అదే ఆశించాను' అని రీట్వీట్ చేశారు. చెక్మేట్ కొవిడ్ పేరుతో జరిగిన ఈ ప్రోగ్రామ్లో సెలబ్రిటీలతో ఆనంద్ ఆడిన గేమ్ల వల్ల వచ్చిన డబ్బును కరోనా సహాయక నిధికి ఇవ్వనున్నారు.