హైదరాబాద్: అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా జరుగుతున్న యూత్ ఒలింపిక్స్లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ రజత పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ 15-21, 19-21 తేడాతో లీ షీఫెంగ్(చైనా) చేతిలో 17 ఏళ్ల ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు ఫైనల్లో ఓడాడు.
గత జూలైలో ఆసియా చాంపియన్షిప్లో తనకు ఎదురైన ఓటమికి షీఫెంగ్ ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు. చైనాకు చెందిన లీ షీఫెంగ్ తొలి గేమ్ను 17 నిమిషాల్లో సొంతం చేసుకోవడం విశేషం. ఇక, రెండో గేమ్ ఇద్దరి మధ్య రసవత్తరంగా సాగింది. 20-17 స్కోరుతో షీఫెంగ్ ఆధిక్యంలో ఉన్న సమయంలో భారత షట్లర్ వరుసగా రెండు పాయింట్లు దక్కించుకున్నాడు.
ఈ సమయంలో షీఫెంగ్ తన అనుభవాన్ని ఉపయోగించి పాయింట్తో పాటు గేమ్ను దక్కించుకుని స్వర్ణం సాధించాడు. జూనియర్ ఆసియా చాంపియన్ అయిన లక్ష్యసేన్.. బెంగళూరులోని ప్రకాశ్ పదుకోన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మరోవైపు మహిళల హాకీలో భారత జట్టు సెమీస్ చేరింది.