
హైదరాబాద్: అర్జెంటీనా రాజధాని బ్యూనస్ఎయిర్స్ వేదికగా జరుగుతున్న యూత్ ఒలింపిక్స్లో యువ షూటర్ మనుభాకర్ మళ్లీ మెరిసింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో తజకిస్తాన్ కుర్రాడు బెహ్జాన్ ఫయ్జులీవ్ జోడీ కట్టిన మను భాకర్ రజత పతకం సాధించింది.
ఈ యూత్ ఒలింపిక్స్లో మను భాకర్కు ఇది రెండో పతకం కావడం విశేషం. మూడు రోజుల క్రితం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో రెండు పతకాలు నెగ్గిన భారత ప్లేయర్గా జుడోకా తబాబి దేవితో సమంగా బాకర్ నిలిచింది.
ఇక, శుక్రవారం ఇక్కడ జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో ఈ జోడీ 3-10 తేడాతో వనెస్సా సీగర్ (జర్మనీ)-కిరిల్ కిరొవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలైంది. మహిళల వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మను భాకర్... టోర్నీ నిబంధనల ప్రకారం పురుషుల విభాగంలో ఫైనల్లో 20వ స్థానంలో నిలిచిన బెహ్జాన్తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో పాల్గొంది.
అయితే, ఈ జంట ప్రత్యర్థికి సరైన పోటీ ఇవ్వలేకపోయింది. తాజా పతకంతో యూత్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్కు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు దక్కినట్లైంది. ఇప్పటివరకు మొత్తం 8 పతకాలు రాగా, అందులో ఐదు షూటింగ్లోనే రావడం విశేషం. ఇక, పురుషుల హాకీలో భారత్ 4-2తో పోలాండ్పై విజయంతో సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
క్వార్టర్స్ లో భారత్ 4-2 గోల్స్ తేడాతో పోలాండ్పై గెలిచింది. భారత జట్టులో శివమ్ ఆనంద్ (1వ, 8వ) రెండు గోల్స్ చేయగా.. మనిందర్ (3వ), సంజయ్ (17వ) చెరో గోల్ సాధించారు. మరోవైపు మహిళల హాకీలో భారత్ 5-2తో దక్షిణాఫ్రికాపై విజయంతో క్వార్టర్స్లోకి ప్రవేశించింది.