ఘజియాబాద్: పేదరికం ప్రతిభ గల క్రీడాకారుల పట్ల శాపంగా మారుతోంది. చాలా మంది క్రీడాకారులు పేదరికం కారణంగానే మనదేశంలో కనుమరుగవుతున్నారు. తాజాగా మరో క్రీడాకారిణి పేదరికంతో తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యువ స్విమ్మర్ సైరా సైరోహి(16) పాఠశాల నుంచి వచ్చిన తర్వాత తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
అయితే ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల రవాణా ఫీజు రూ.45,000 కట్టలేకపోవడంతో గత కొద్దిరోజులుగా ఆమె పాఠశాలకు వెళ్లలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.
దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ గుప్తా మాట్లాడుతూ... సైరా పూర్తిగా స్కాలర్షిప్ మీద చదువుతోందని కేవలం బస్సు ఫీజు మాత్రమే కట్టమని కోరామని, అది కూడా గత రెండేళ్లుగా వారు చెల్లించలేదని తెలిపారు. ఇటీవల ఆమె తండ్రి ఒక ఉత్తరాన్ని సమర్పించటంతో ఆమెను పాఠశాలకి అనుమతిస్తున్నట్లు తెలిపారు.
కాగా, 16ఏళ్ల యువ స్విమ్మర్ సైరా ఇప్పటికి పలు పోటీల్లో దాదాపు 100 బంగారు పతకాలను సాధించింది. 2015 సంవత్సరానికి గాను వరల్డ్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్కి ఎన్నికైన ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వాటిలో పాల్గొనలేదు. గతంలో 16గంటల 38 నిమిషాల్లో దాదాపు 38 కిలోమీటర్లు ఈత కొట్టి రికార్డు కూడా నెలకొల్పింది సైరా.
సైరా మృతి పట్ల స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. భవిష్యత్లో మనదేశానికి ప్రాతినిథ్యం వహిస్తుందనుకున్న క్రీడాకారిణి ఇలా చేయడం బాధాకరమని పేర్కొంది. స్విమ్మింగ్ క్రీడలో ఆమెకు మంచి భవిష్యత్ ఉండేదని తెలిపింది. 2020 ఒలింపిక్స్లో తాను పాల్గొంటానని సైరా ఎప్పుడూ చెబుతుండేదని పేర్కొంది.