టోక్యో: కరోనా వైరస్ మహమ్మారి కరుణిస్తేనే విశ్వక్రీడలు జరుగుతాయని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ యొషిరో మోరి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వచ్చే ఏడాదీ మెగా ఈవెంట్ అసాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి లేకుంటే ఈ పాటికి అథ్లెట్లు, అభిమానులతో టోక్యో కళకళలాడేది. ప్రపంచమంతా ఒలింపిక్ జోష్తో ఉరకలేసేది. కానీ వైరస్ విశ్వసంబరాన్ని బలితీసుకుంది.
ఈ నెల 24న ఆరంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ను 2021కు వాయిదా వేయక తప్పలేదు. వైరస్ శాంతిస్తే, అంతా సవ్యంగా సాగితే సరిగ్గా వచ్చే ఏడాది ఇదే రోజు (జులై 23, 2021) ఒలింపిక్స్ (టోక్యో 2020) మొదలు కానున్నాయి. క్రీడల నిర్వహణపై అనుమానాలు, భయాలు అలాగే ఉన్నా.. అనిశ్చితి కొనసాగుతున్నా.. సగటు క్రీడాభిమాని మాత్రం ఆటలు జరుగుతాయనే ఆశాభావంతోనే ఉన్నాడు.
జపాన్కు చెందిన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యొషిరో మోరి మాట్లాడుతూ... 'వైరస్ తీవ్రత ఇలాగే కొనసాగితే ఒలింపిక్స్ నిర్వహించలేం. అయితే ఈ పరిస్థితి మరో ఏడాది పాటు కొనసాగుతుందని అనుకోవట్లేదు. ఒలింపిక్స్ జరుగుతాయా? లేదా? అన్నది వైరస్ను మానవ జాతి ఓడిస్తుందా? లేదా? అన్న దానిపై ఆధారపడి ఉంది. వీలైనంత త్వరగా టీకా లేదా ఔషధం తయారు చేయడం ముఖ్యం' అని పేర్కొన్నారు.
వైరస్ వల్ల సరిగ్గా వచ్చే ఏడాది ఇదే తేదీకి వాయిదా వేశారు. ఆ రీ షెడ్యూల్ తేదీ గుర్తుగా గురువారం టోక్యో ప్రధాన స్టేడియంలో చిన్న వేడుక నిర్వహించనున్నారు. కేవలం పదుల సంఖ్యలో పాల్గొనే ముఖ్యులతో ఈ తంతును ముగిస్తారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వచ్చే ఏడాది ఆటల వేడుక జరగాలని జపాన్ ప్రభుత్వం లాగే బలంగా కోరుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్కు మరో వాయిదా ఉండదని.. 2021లో జరగ్గపోతే ఈ విశ్వ క్రీడలను రద్దు చేస్తామని ఇది వరకే స్పష్టం చేశారు.
టీ20 ప్రపంచకప్ ఏమైనా ఫర్వాలేదు.. ఐపీఎల్కు మాత్రం ఏం జరగొద్దా?: అక్తర్ ఫైర్