న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. మంచి ఆటగాడిగా పేరున్న యోగేశ్వర్ మనసున్న వ్యక్తిగా కూడా నిరూపించుకున్నాడు. డోపింగ్ ఫలితాల్లో పాజిటివ్ అని తేలి ప్రస్తుతం మన మధ్యన లేనటువంటి రష్యన్ రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ రజత పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు.
యోగేశ్వర్ దత్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే బాధపడుతున్న అతడి కుటుంబాన్ని సాంత్వన చేకూర్చే విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే... 2012 లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్ భారత్కు కాంస్య పతకం సాధించడం, ఆ కాంస్యం నాలుగేళ్ల తర్వాత రజత పతకంగా మారిన సంగతి తెలిసిందే.

లండన్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్కు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో పాజిటివ్ ఫలితం రావడంతో ఆ పతకాన్ని ఒలింపిక్ కమిటీ వెనక్కి తీసుకుంది. దీంతో ఆ రజత పతకం తనకు దక్కినట్లు యోగేశ్వర్ దత్ ఆగస్టు 30న మీడియా ముఖంగా ప్రకటించాడు.
అయితే ఇప్పుడు ఆ రజత పతకాన్ని యోగేశ్వర్ దత్ తీసుకునేందుకు నిరాకరించాడు. దీనిపై యోగేశ్వర్ ట్విట్టర్లో స్పందించాడు. 'రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ మంచి రెజ్లర్. అయితే చనిపోయిన తర్వాత డోపింగ్ టెస్టులో విఫలమవడం దురదృష్టకరం. ఒక క్రీడాకారుడిగా నేను గౌరవిస్తున్నాను. ఇప్పటికే ఆ రెజ్లర్ ను కోల్పోయి కుదుఖోవ్ కుటుంబం ఎంతో బాధలో ఉండి ఉంటుంది. అందుకే ఆ రెజ్లర్ సాధించిన పతకాన్ని అతడి గౌరవార్థం ఆ కుటుంబం వద్దనే ఉండాలి. ఈ సమయంలో మనం మానవతాదృక్పథంతో నడుచుకోవాలి' అని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.