న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ 2016లో పతకం సాధిస్తాడనుకున్న రెజ్లర్ యోగేశ్వర్ దత్ తొలి రౌండ్లొనే ఓటమిపాలై నిరాశపర్చిన విషయం తెలిసిందే. అయితే, అయితే, అతనికి లండన్ ఒలింపిక్స్ 2012 రూపంలో మరో ఉన్నత పతకం అందనుంది.
అసలు విషయమేమిటంటే.. భారత రెజ్లర్ యోగేశ్వర్దత్ లండన్ ఒలింపిక్స్లో సాధించిన పతకంలో మార్పు జరగనున్నట్లు సమాచారం. ఆ ఒలింపిక్స్లో దత్ కాంస్య పతకం సాధించగా.. ఇప్పుడు రజతం ఇవ్వనున్నారు. ఆ పోటీల్లో రజతం సాధించిన రష్యన్ రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ కమిటీల నుంచి లేఖ వచ్చిన తర్వాత భారత రెజ్లింగ్ సమాఖ్య ధ్రువీకరించి.. రజత పతకాన్ని అందిస్తుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో 60కేజీల పురుషుల ఫ్రీ స్టయిల్ విభాగంలో యోగేశ్వర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
రష్యాకు చెందిన బెసిక్ రజతం సాధించాడు. అయితే ఇటీవల వాడా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో బెసిక్ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. లండన్ ఒలింపిక్స్కు ముందు బెసిక్ నుంచి తీసుకున్న నమూనాలను మరోసారి పరీక్షించగా.. ఈ విషయం వెల్లడైంది. దీంతో అతడి ఆటను రద్దు చేసి, ఆ పతకాన్ని యోగేశ్వర్కు ఇచ్చే యోచనలో ఉన్నారు.
కాగా, నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్, రెండు సార్లు ఒలింపిక్ విజేతగా నిలిచిన బెసిక్.. 2013లో రష్యాలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో భారత్కు ఆరు పతకాలు రాగా.. అందులో రెండు రజతాలు ఉన్నాయి. షూటింగ్లో విజయ్కుమార్, రెజ్లింగ్ సుశిల్ కుమార్ రజత పతకం సాధించారు. అయితే, ఇప్పుడు యోగేశ్వర్ పతకాన్ని మార్చితే.. ఆ సంఖ్య మూడుకు చేరుతుంది.
రజతం ఖరారైంది: యోగేశ్వర్
తనకు రజతం ఖరారైందన్న విషయాన్ని రెజ్లర్ యోగేశ్వర్ దత్ తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశాడు. 'కాంస్యం నుంచి రజతంగా మార్చినట్లు నాకు ఈ రోజు ఉదయం తెలిసింది. ఈ పతకాన్ని దేశ ప్రజలకు అంకితమిస్తున్నా' అంటూ యోగేశ్వర్ ట్వీట్ చేశారు.