
టెక్సాస్: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)కు దిగ్గజ రెజ్లర్ ది అండర్టేకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. 30 ఏళ్లుగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న 55 ఏళ్ల స్టార్ రెజ్లర్ తన రింగ్ కెరీర్కు సోమవారం వీడ్కోలు పలికారు. ది లాస్ట్ రైడ్ డాక్యూ సిరీస్ చివరి ఎపిసోడ్లో ఈ విషయాన్ని అండర్టేకర్ వెల్లడించారు. అండర్టేకర్ అసలు పేరు మార్క్ విలియం కలవే. యునైటెడ్ స్టేట్స్లోని టెక్సాస్లో అతడు జన్మించారు. రింగ్లో అండర్టేకర్గా ఇతడు ఫేమస్.
'నాకు మరోసారి రెజ్లింగ్ రింగ్లోకి అడుగుపెట్టాలనే కోరిక లేదు. నేను గెలవడానికి ఏమీ లేదు. నేను సాధించేది కూడా ఏమీ లేదు. ప్రస్తుతం ఆట మారింది. ఇప్పడు కొత్తవారు రావడానికి సరైన సమయం. ఈ డాక్యూమెంటరీ నాకు చాలా సాయం చేసిందని భావిస్తున్నా. ఇది ఒక రకంగా నా కళ్లు తెరిపించింది' అని ది లాస్ట్ రైడ్ డాక్యూ సిరీస్ చివరి ఎపిసోడ్లో అండర్టేకర్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అండర్టేకర్ ట్విటర్ ద్వారా కూడా వెల్లడించారు.
రెజ్లింగ్లో తన ప్రయాణం ముగిసిందని ట్విటర్లో కూడా అండర్టేకర్ పేర్కొన్నారు. 'నాకు తెలుసు చివరి వరకూ మీరు నా ఆటను ప్రశంసిస్తూ ఉండలేరని. కొత్త కుర్రాళ్లు రావడానికి సమయం ఆసన్నమైంది' అని అతడు ట్వీట్ చేశారు. మిగిలిన జీవితంలో తన శ్రమకు దక్కిన ఫలాలను అస్వాదించనున్నట్టు తెలిపారు. మరోవైపు అండర్టేకర్ రిటైర్మెంట్పై డబ్ల్యూడబ్ల్యూఈ నెట్వర్క్ సోషల్ మీడియాలో పలు పోస్ట్లు చేసింది. అండర్టేకర్కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది.
రెసిల్ మేనియా 36లో ఏజే స్టైల్స్తో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మ్యాచ్ తన కెరీర్కు ఉత్తమ ముగింపు అని అండర్టేకర్ పేర్కొన్నారు. కాగా అండర్టేకర్ తన చివరి మ్యాచ్లో ఏజే స్టైల్స్తో తలపడ్డారు. రిటైర్మెంట్పై ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టు స్పందించింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ హేవీ వెయిట్ చాంపియన్షిప్ బెల్ట్ను పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. 30 అద్భుతమైన సంవత్సరాలు అని పేర్కొన్న ముంబై.. థాంక్యూ టేకర్ అని రాసుకొచ్చింది.