
హైదరాబాద్: భారత్కు రెండు ఒలింపిక్ పతకాలు అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మళీ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే జరిగిన గొడవకు సంబంధించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అతనికి నోటీసులు జారీ చేసింది.
డిసెంబరు 29న కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా సుశీల్, మరో రెజ్లర్ రాణా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై వివరణ కోరుతూ డబ్ల్యూఎఫ్ఐ తాజాగా సుశీల్కు నోటీసులు జారీ చేసింది. ఘర్షణపై పర్వీన్ రాణా డబ్ల్యూఎఫ్ఐను ఆశ్రయించాడు. దీనికి స్పందించిన అధికారులు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంటూ సుశీల్కు నోటీసులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే.. కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్ డిసెంబరు 29న దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఆ సమయంలో రెజ్లర్లు సుశీల్ కుమార్, పర్వీన్ వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఇండోర్ స్టేడియం రణరంగంగా మారింది. సుశీల్ సెమీఫైనల్లో రాణాపై విజయం అనంతరం గొడవ మొదలైంది.
సుశీల్తో పోటీపడేందుకు సాహసించినందుకు తనను, తన అన్నను అతడి మద్దతుదారులు కొట్టారని రాణా ఆరోపించాడు. బౌట్ సందర్భంగా రాణా తనను కొరికాడని సుశీల్ చెప్పాడు. ఐతే ప్రొ రెజ్లింగ్ లీగ్లో పాల్గొంటే తనను చంపుతామంటూ సుశీల్ మద్దతుదారులు బెదిరిస్తున్నారని రాణా ఆరోపించాడు. ఈ ఘర్షణపై రాణా దిల్లీ పోలీసులకు ఫర్యాదు చేయడంతో వారు సుశీల్తో పాటు అతని మద్దతుదారులపై కూడా కేసు నమోదు చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.