రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. తమకు న్యాయం కావాలని కొందరు స్టార్ రెజ్లర్లు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెజ్లర్ల ప్రవర్తనను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష తప్పుబట్టారు. ఇలా రోడ్డెక్కి గొడవ చేయడం ద్వారా దేశం పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
డబ్ల్యూఎఫ్ఐలో లైంగిక వేధింపులపై ఐఓఏ ఒక కమిటీ వేసింది. ఈ విషయంలో ఇంకా ఆ కమిటీ విచారణ ప్రారంభం అవలేదు. ఈ క్రమంలోనే మరోసారి రెజ్లర్లు రోడ్డెక్కారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఇది సదరు క్రీడాకారుల క్రమశిక్షణారాహిత్యమని పీటీ ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన భజరంగ్ పూనియా.. ఆమె అలా అంటుందని అస్సలు ఊహించలేదన్నాడు.

ఒక మహిళ అయ్యుండి పీటీ ఉష అన్న మాటలు చాలా బాధించాయని చెప్పాడు. ఆమె తమకు మద్దతు ఇస్తుందని భావించామని, కానీ ఆమె అలా అనడం ఏమాత్రం బాగలేదని అన్నాడు. దీంతో ప్రతిపక్షాలు మరోసారి బీజేపీపై దండెత్తాయి. బీజేపీ ఎంపీని కాపాడేందుకే పీటీ ఉష ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని, ఆమె ప్రభుత్వం తరపు 'మౌత్ పీస్'గా మారిందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే బ్రిజ్ భూషణ్పై కేసు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు అంగీకరించారు. సదరు రెజ్లర్ల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమకు ఢిల్లీ పోలీసులపై నమ్మకం లేదని, సుప్రీం కోర్టు ముందే తమ గోడు వెళ్లబోసుకుంటామని రెజ్లర్లు అంటున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు.
చావనైనా చస్తాను కానీ, ఫైట్ చేయకుండా వెనక్కు తగ్గను అంటూ ఆయన తేల్చిచెప్పారు. తను ఎవరిపైనా లైంగిక వేధింపులకు పాల్పడలేదని, ఇలాంటి ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాలి.