ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న రెజ్లర్లపై ఇండియన్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఈ క్రీడాకారులు ఇలా రోడ్లెక్కి గొడవలు చేయడం వల్ల దేశం పరువుకు భంగం కలుగుతుందని, ఇది వారిలో క్రమశిక్షణ లేకపోవడాన్ని బయట పెడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని రోజులుగా ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా సహా పలువురు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద రోడ్డుపైనే నిద్రిస్తూ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో వీళ్లు ఈ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయాలని, బ్రిజ్ భూషణ్పై విచారణ చేపట్టాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

'రెజ్లర్లు ఇలా రోడ్డెక్కి నిరసనలు చేయడం వారి క్రమశిక్షణారాహిత్యాన్ని స్పష్టం చేస్తంది. దీని వల్ల భారత ప్రతిష్ఠ దెబ్బతింటోంది' అని ఉష అన్నారు. ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే డబ్ల్యూఎఫ్ఐ నడిపేందుకు మాజీ షూటర్ సుమా షిరూర్, వుషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ భూపేంద్ర సింగ్ బజ్వాతోపాటు ఒక హైకోర్టు జడ్జితో కూడిన ముగ్గురు మెంబర్ల కమిటీని ఐఓఏ ఏర్పాటు చేసింది.
వీరిలో ఇంకా ఏ జడ్జిని నియమించాలో డిసైడ్ అవ్వలేదు. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునే వరకు ఈ ముగ్గురు మెంబర్ల కమిటీనే డబ్ల్యూఎఫ్ఐ పనులు చూస్తుందని ఐఓఏ తెలిపింది. ఈ ఏడాది ఆరంభంలో ఇళాగే రెజ్లర్లు నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే రంగంలోకి దిగిన ప్రభుత్వ ప్రతినిధులు, ఐఓఏ ప్రతినిధులు కలిసి రెజ్లర్లతో మాట్లాడారు. ఈ విషయాన్ని కచ్చితంగా సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. బ్రిజ్ భూషణ్, డబ్ల్యూఎఫ్ఐ కార్యవర్గం విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు రెజ్లర్లు రోడ్డెక్కడం చర్చకు దారితీసింది.