భారత స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ను నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై ఇతర రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు వీళ్లిద్దరూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ నిరసనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు.
ఇలా చాలా కాలంగా రెజ్లింగ్కు దూరంగా ఉన్న వీరిద్దరినీ ట్రయల్స్ కూడా లేకుండా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై చాలా మంది రెజ్లర్లు, కోచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎవరినైనా ఇలా ట్రయల్స్ లేకుండా ఎంపిక చేయాలంటే.. ఆయా ప్లేయర్ల పేర్లను కోచ్లు సిఫారసు చేయాల్సి ఉంటుంది. కానీ భజరంగ్, వినేష్ విషయంలో కోచ్లకు కూడా ఎలాంటి సమాచారం లేదట.

ఇంత కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం కోచ్లకు కూడా చెప్పకపోవడం అందరికీ మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. దీనిపై జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అంతిమ్ పాంఘల్ కూడా అసహనం వ్యక్తం చేసింది. ఆమెతోపాటు మరి కొంతమంది రెజ్లర్లు నిరసన చేస్తూ రోడ్డెక్కారు. భజరంగ్, వినేష్ ఇద్దర్నీ ఇలా నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడం సరికాదని వాళ్లు అంటున్నారు.
వినేష్ వెయిట్ కేటగిరీలో పోటీ పడే చాలా మంది చాలా ఈజీగా ఆమెను ఓడించగలరని, చాలా రోజులుగా వినేష్ ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదని అంతిమ్ చెప్పింది. ఈ విషయంపై డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కూడా స్పందించారు. ఈ నిర్ణయం తనను చాలా బాధించిందని చెప్పారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దేశంలో రెజ్లింగ్ నష్టపోతుందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు రెజ్లర్లు, వాళ్ల కుటుంబాలు కోర్టు మెట్లు కూడా ఎక్కడం గమనార్హం.