కోహ్లీతో పాటు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేర్లు
అప్పట్లో క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం పతకం సాధించాడు. నీరజ్ తన జావెలిన్ను 86.47 మీటర్ల దూరం విసిర స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
తొలి జావెలిన్ త్రోయర్గా నీరజ్ చోప్రా చరిత్ర
ఈ సీజన్లో నీరజ్కు ఇదే బెస్ట్ త్రో కావడం విశేషం. అంతేకాదు కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం రావడం ఇదే తొలిసారి. ఇక, ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు. దీంతో ఆసియా గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత తొలి జావెలిన్ త్రోయర్గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.
టెస్టు ర్యాంకింగ్స్లో కోహ్లీ నంబర్వన్
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే, నిలకడగా రాణిస్తూ ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని అందుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకుంటాడని అందరూ భావించారు. అయితే, ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
కోహ్లీకి గట్టి పోటీగా భజ్రంగ్, వినేశ్
అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎలాగూ సమయం ఉండటంతో ఈ ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణాలు గెలిచిన పునియా, వినేశ్ పేర్లను రాజీవ్ ఖేల్ రత్నకు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు పునియా ఇప్పటికే దరఖాస్తు నింపి పంపినట్లు తెలుస్తోంది. మరోపక్క వినేశ్ కూడా దరఖాస్తు పంపినట్లు తెలుస్తోంది. దీంతో రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని వీరిలో ఎవరు అందుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.