న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) విద్యార్థి కన్నయ్య కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైన రెజ్లర్ యోగేశ్వర దత్ స్పందించారు. గతంలో జెఎన్యు వివాదంపై సోషల్ మీడియాలో ఓ కవిత రాసి తన దేశభక్తిని చాటుకున్నారు.
ఇప్పుడు కన్నయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ట్విట్టర్లో స్పందించారు. విద్యార్థి నేత కన్నయ్య కుమార్, కొంతమంది రాజకీయవేత్తల పైనా ఘాటుగా స్పందించారు.
కొంతమంది పాములకు పాలు పోసిన పెంచితే, పాలు తాగిన ఆ పాములు మన అమర జవాన్ల పైన ఆరోపణలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. మన సైనిక సోదరులపై విషాన్ని వెదజల్లుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జెఎన్యులో జాతి వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో గతంలో యోగేశ్వర దత్ స్పందిస్తూ... పార్లమెంటుపైన దాడి చేసిన అఫ్జలు గురు అమరుడైతే, లాన్స్ నాయక్ హనుమంతప్ప ఏమవుతారో చెప్పాలని యోగేశ్వర్ దత్ ప్రశ్నించారు.
కాగా, కన్నయ్య కుమార్ ఇటీవల మాట్లాడుతూ... కాశ్మీర్ మహిళలపై భారత సైనికులు అత్యాచార పరంపర సాగిస్తున్నారని అతడు ఆరోపించాడు. మంగళవారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతను మాట్లాడాడు. ఈ సందర్భంగా అతను పైవ్యాఖ్యలు చేశాడు.
అంతేకాదు, కాశ్మీర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ (ఏఎఫ్ఎస్పీఏ)కు వ్యతిరేకంగా గళం ఎత్తుతానని కూడా అతను వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. పార్లమెంటుపై జరిగిన దాడిలో దోషిగా తేలి ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు మద్దతుగా.. వర్సిటీలో విద్యార్థులు గత నెల 9 వర్ధంతి సభను నిర్వహించిన విషయం తెలిసిందే.