
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్కు కరోనా పాజిటివ్ అని తేలింది. జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా.. అవార్డుల కార్యక్రమం కోసం శుక్రవారం జరిగిన రిహార్సల్స్కు హాజరు కావడానికి ముందు వినేశ్..కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఇందులో వైరస్ సోకినట్లు బయటపడింది. రాజీవ్గాంధీ ఖేల్రత్న పురస్కారానికి ఎంపికైన వినేశ్.. శనివారం జరిగే అవార్డుల కార్యక్రమానికి దూరం కానున్నారు. 'దేవుని దయతో త్వరలోనే నేను వైరస్ నుంచి కోలుకుంటాను' అని వినేశ్ పేర్కొన్నారు.
క్రీడా పురస్కారాలు అందుకోబోతున్న క్రీడాకారుల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది. అందులో ఇద్దరు.. రెజ్లర్ వినేశ్ పొగట్ (ఖేల్రత్న), తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ (అర్జున)గా వెల్లడైంది. అయితే మరొకరి వివరాలు తెలియలేదు. సాత్విక్కు కరోనా సోకినా సంగతి గురువారమే వెల్లడి కాగా.. వినేశ్కు కరోనా ఉన్నట్లు శుక్రవారం ఆమే స్వయంగా వెల్లడించారు.
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమాన్ని తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 74 మంది అవార్డీలకు (5 ఖేల్రత్న, 27 అర్జున సహా) వైద్య పరీక్షలు చేయగా.. ముగ్గురికి కరోనా సోకినట్లు సాయ్ తెలిపింది. వీరేకాక అనారోగ్యంతో ఉన్న మరో ఆరుగురు కూడా శనివారం జరిగే అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావట్లేదు. ఈ పురస్కారాలను అందుకోవడానికి అవార్డీలు తమకు కేటాయించిన సాయ్ కేంద్రాలకు రావాల్సి ఉంటుంది.
ఇప్పటికే అవార్డులను, సర్టిఫికెట్లను, బ్లేజర్లను ఆయా కేంద్రాలకు పంపించామని, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తమ పేర్లను చదవగానే వాళ్లు ట్రోఫీ, సర్టిఫికెట్లను అందుకోవాలని సాయ్ పేర్కొంది. డిల్లీ, ముంబై, కోల్కతా, చండీగఢ్, బెంగళూరు, పుణె, సోనెపట్, హైదరాబాద్, భోపాల్ సాయ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో అయిదుగురికి ఖేల్రత్న అవార్డులు ప్రకటించారు.