భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫోగట్ ఫైనల్ కు చేరారు. అయితే ఆమె 50 కేజీల ఫైనల్కు 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో అనర్హత వేటు పడింది. ఆమె దీనిపై పోరాటం చేశారు. ఆమె అనర్హతపై వినేష్ చేసిన అప్పీల్ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తాత్కాలిక విభాగం కూడా తిరస్కరించింది. ఆమె చివరికి స్వదేశం తిరిగొచ్చారు.
వినేష్ కు మద్దతు తెలిపేందుకు వందలాది మంది మద్దతుదారులు న్యూఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి వచ్చారు. ఆ తర్వాత హర్యానాలోని వినేష్ స్వగ్రామానికి వెళ్లారు. హర్యానాలోని బలాలీకి వచ్చిన తరువాత, వినేష్ తన మామ, గురువు మహావీర్ సింగ్ ఫోగట్ను కలిశారు. ఇద్దరూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఒలింపిక్స్లో వినేష్ అనర్హత వేటు పడిన సమయంలో, మహావీర్ నిరంతరం వినేష్కు మద్దతునిస్తూనే ఉన్నారు.

వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లు, అభిమానులందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఆగష్టు 8న వినేష్ రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు భావోద్వేగ ప్రకటన చేశారు. ఆ తర్వాత "నా తోటి భారతీయులు, నా గ్రామం, నా కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రేమ లభించినందున, ఈ గాయాన్ని మాన్పించడానికి నాకు కొంత ధైర్యం వస్తుందని నేను భావిస్తున్నాను. బహుశా, నేను రెజ్లింగ్కు తిరిగి రావచ్చు" అని వినేష్ మీడియాతో అన్నారు.
"ఒలింపిక్ పతకాన్ని కోల్పోవడం నా జీవితంలో అతిపెద్ద గాయం అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. నేను కుస్తీని కొనసాగిస్తానో లేదో నాకు తెలియదు. ఈ రోజు (శనివారం) నాకు లభించిన ధైర్యాన్ని నేను సరైన దిశలో ఉపయోగించాలనుకుంటున్నాను" అని తెలిపారు.
వినేష్ ఆమె సహచర ఒలింపియన్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా గ్రాప్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక సంవత్సరానికి పైగా నిరసనలు చేస్తున్నారు. "మా పోరాటం ముగియలేదు, పోరాటం కొనసాగుతుంది. నిజం గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని వినేష్ అన్నారు.