
హైదరాబాద్: ప్రముఖ రెజ్లర్, 1974లో టెహ్రాన్ ఆసియన్ గేమ్స్లో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన సుఖ్చైన్ సింగ్ చీమా మరణించారు. పాటియాల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యాడు. 67 ఏళ్ల సుఖ్చైన్ సింగ్ చీమా బుధవారం సాయంత్రం భన్రి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.
షేర్మజ్రా సమీపంలో రాజ్పురా నుండి వస్తున్న కారు చీమా నడుపుతున్న వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ఆయన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన చీమాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 'రుస్తుం-ఈ-హింద్' రెజ్లర్ కేశర్ సింగ్ చీమా కుమారుడే ఈ సుఖ్చైన్. తన తండ్రి పేరిట పాటియాల లోని అఖారాలో శిక్షణ కేంద్రాన్ని కూడా సుఖ్చైన్ నడుతున్నాడు. 1974లో జరిగిన టెహ్రాన్ ఆసియన్ గేమ్స్లో గ్రిగో-రోమన్ స్టైల్ విభాగంలో, ఫ్రీస్టైల్లో రెండు పతకాలు సాధించాడు.
ఇదిలా ఉంటే చీమా కుమారుల్లో ఒకడైన పల్వీందర్ సింగ్ చీమా పంజాబ్లోని పోలీస్ శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్నాడు. అతను కూడా 'రుస్తం-ఈ-హింద్' సభ్యుడే. కాగా, రెజ్లర్ సుఖ్చైన్సింగ్ చీమా అకాల మృతి పట్ల పంజాబ్ సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన సంతాపాన్ని తెలియజేశారు.