టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 13వ రోజుకు చేరుకుంది. జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఈ అత్యుత్తమ క్రీడా వేదికలో భారత అథ్లెట్లు తమ పతకాల వేటలో పడ్డారు. 13వ రోజు ఫస్ట్ హాఫ్లో రెండు విజయాలను భారత తన ఖాతాలో వేసుకుంది. ఒక పరాజయాన్ని చవి చూసింది. మరిన్ని ఈవెంట్లు ఉత్కంఠభరితంగా సాగుతోన్నాయి. వాటి ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. గ్రూప్ ఏ జావెలిన్ థ్రో విభాగంలో నీరజ్ చోప్రా భారత్ను ఫైనల్స్కు చేర్చాడు. జావెలిన్ థ్రో క్వాలిఫికేషన్స్లో మొదటి స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్లో ఇప్పటికే రజత పతకాన్ని ఖాయం చేసుకున్న అస్సామీ యువతి లవ్లీనా బొర్గోహెయిన్.. స్వర్ణంపై ఫోకస్ పెట్టారు. మహిళల హాకీ జట్టు పతకం కోసం ఇంకో మ్యాచ్ను గెలవాల్సి ఉంది. ఒకరకంగా ఒలింపిక్స్లో భారత్కు ఇది బిగ్ డేగా చెప్పుకోవచ్చు. కాగా- అదే ఊపులో భారత కుస్తీ వీరుడు రవి కుమార్ దహియా రెచ్చిపోయాడు. ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో అతను క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాడు.
అదే సమయంలో మహిళా రెజ్లర్ అన్షు మలిక్ నిరాశపరిచారు. మహిళల 57 కేజీల రెజ్లింగ్ 1/8 ఫైనల్ రౌండ్లో ఆమె ఓడిపోయారు. ఈ రౌండ్లో బెలారస్కు చెందిన ఇరైనా కురచ్కిన్ చేతిలో 8-2 తేడాతో ఓటమి చవి చూశారు. దీనికి పూర్తి భిన్నంగా రవి కుమార్ దహియా బౌట్ కొనసాగింది. ప్రత్యర్థిపై ఏకపక్షంగా విజయాన్ని సాధించాడతను. పురుషుల 57 కేజీల రెజ్లింగ్ 1/8 విభాగంలో అతను కొలంబియాకు చెందిన ఆస్కార్ టైగ్రెరాస్పై గెలుపొందాడు. ఈ విజయంతో అతను క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు.
అతనితో పాటు దీపక్ పునియా కూడా క్వార్టర్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 86 కేజీల ఫ్రీస్టైల్ పురుషుల విభాగంలో అతను నైజీరియాకు చెందిన ఎకెెరెకెమె అగియోమోర్ను చిత్తు చేశాడు. ఈ రెండు ఈవెంట్లు కూడా పతకాలపై ఆశలను రేకెత్తించేలా చేశాయి. క్వార్టర్ ఫైనల్స్ గండాన్ని దాటుకోవాల్సి ఉంటుంది వారిద్దరికీ. అన్షుమలిక్ నిరాశ పరచడంతో ఆ కేటగిరీలో మహిళల ప్రస్థానం ముగిసినట్టయింది. అన్షు మలిక్ విజయవంతంగా ఈ రౌండ్ను అధిగమిస్తారని ఆశించినప్పటికీ.. ఆమె నిరాశ పరిచారు.