
హంగరీ: టోక్యో ఒలింపిక్స్ 2021లో శనివారం భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం మరో క్రీడా వేదికలో రెజ్లర్ ప్రియా మాలిక్ బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించింది. వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రెజ్లర్ ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించింది. హంగరీలోని బుడాపెస్ట్లో ఆదివారం జరిగిన 73 కేజీల విభాగం ఫైనల్లో బెలారస్ ప్రత్యర్థి కెనియా పటపోవిచ్పై 5-0 తేడాతో ఆమె గెలిచింది.
ఈ మధ్య కాలంలో ప్రియా మాలిక్ మంచి ఫామ్లో ఉంది. 2019లో జరిగిన ఖేలో ఇండియాలో ప్రియా గోల్డ్ మెడల్ సాధించింది. అదే ఏడాది ఢిల్లీలో జరిగిన 17వ స్కూల్ గేమ్స్లోనూ ప్రియా గోల్డ్ మెడల్ పట్టింది. గతేడాది కూడా ఆమె రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. ప్రియా ఫామ్ చూస్తుంటే.. భారత్ ఖాతాలో మరిన్ని మెడల్స్ చేరే ఆకాశం ఉంది/. ఇక గురువారం జరిగిన ఇదే వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్షిన్ 65 కేజీల విభాగంలో మరో ఇండియన్ రెజ్లర్ వర్ష కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది.
టోక్యో ఒలింపిక్స్లో మీరాభాయ్ చాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై ప్రియా మాలిక్ సత్తా చాటడం విశేషం. ప్రపంచ వేదికలపై భారత మహిళా అథ్లెట్లు సత్తాచాటడం మనకు గర్వకారణం. ఇక టోక్యో ఒలింపిక్స్లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా.. మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగట్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.