రియో డీ జనీరో: డోపింగ్ కేసులో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్పై వేటు పడింది. డోప్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ యాదవ్కు భారత డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా).. క్రీడల అర్బిట్రేషన్ కోర్టు (కాస్)లో సవాల్ చేయగా.. విచారణలో నర్సింగ్ దోషిగా తేలాడు.

కుట్ర వల్లే నర్సింగ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడనే వాదనను తోసిపుచ్చిన కాస్ ఫ్యానల్ అతనిపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఒకవేళ నర్సింగ్ నిర్దోషిగా తేలితే శుక్రవారం తొలి మ్యాచ్లో బరిలోకి దిగేవాడు. దీంతో ఆ అవకాశం కోల్పోయాడు.
దీంతో భారత్ కు పతకం తెస్తాడనుకున్న నర్సింగ్ యాదవ్ బరిలోకి దిగకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుశీల్ కుమార్తో పోటీ పడి ఒలింపిక్స్ అర్హత సాధించిన నర్సింగ్ యాదవ్ ఇప్పుడు డోపీగా తేలి నాలుగేళ్లపాటు నిషేధానికి గురికావడం అందర్నీ షాకింగ్ కు గురిచేసింది.
ఏడ్చేసిన నర్సింగ్ యాదవ్: కన్నీటి పర్యంతమైన కుటుంబం
'ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాలన్న నా కలను క్రూరంగా నాశనం చేశారు. నా అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ఏమైనా చేస్తా' అని నర్సింగ్ యాదవ్ భావోద్వేగంతో అన్నారు.
కాగా, డోపింగ్ కేసులో నాలుగేళ్లపాటు నిషేధానికి గురైన భారత రెజ్లర్ దుఃఖంలో మునిగిపోయినట్లు భారత రెజ్లింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బీబీ సహ్రాన్ సింగ్ వెల్లడించారు. నిషేధం విధించినట్లు తెలిసినప్పటి నుంచి నర్సింగ్ యాదవ్ ఏడుస్తూనే ఉన్నాడని.. ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేడని తెలిపారు. నర్సింగ్పై ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తంచేశారు.
నర్సింగ్ సోదరి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకుని నర్సింగ్పై నిషేధం రద్దు చేయించాలని కోరారు. అతడు తప్పకుండా స్వర్ణం గెలుస్తాడన్నారు. నర్సింగ్ తల్లి సహా కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తన కుమారుడు కుట్రకు బాధితుడయ్యాడని.. నిషేధం విధించడంతో నోట మాట రావడం లేదని నర్సింగ్ తల్లి భులానా దేవి ఆవేదన వ్యక్తంచేశారు.