
ఛండీఘడ్: భారత స్టార్ రెజ్లర్ బబితా కుమారి ఫోగాట్ పోలీసు ఇన్స్పెక్టరు ఉద్యోగానికి చేసిన రాజీనామాను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. దీంతో బబితాకు లైన్ క్లియర్ అయింది. రాజీనామాను హర్యానా ప్రభుత్వం ఆమోదించడంతో.. త్వరలో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినిగా బబితా బరిలోకి దిగే అవకాశం ఉంది.
బబితా ఫోగాట్ ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీన బీజేపీలో చేరారు. ఉద్యోగ రాజీనామా ఆమోదం పొందకుండానే బీజేపీలో చేరడంతో చట్ట ప్రకారం ఆమె వద్ద నుంచి రెండు నెలల జీతాన్ని వసూలు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. బబితా ఆగస్టు 13వ తేదీన పోలీసు ఇన్స్పెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేయగా.. ఈ నెల పదో తేదీన సర్కారు ఆమె రాజీనామాను ఆమోదించింది. 'నేను పార్టీలో చేరాను. రాజీనామా సమర్పించిన తర్వాత మాత్రమే పార్టీలో చేరవచ్చు. ఆగస్టులో నా రాజీనామాను సమర్పించాను. రాజీనామాను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది' అని బబితా పేర్కొన్నారు.
ఇక బీజేపీ అభ్యర్థినిగా వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బబితా పోటీ చేసేందుకు సిద్డగా ఉందని సమాచారం. హర్యానా రాష్ట్రంలోని బర్దా లేదా చారఖీ దాద్రీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశముందని బీజేపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బబితాతో పాటు ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్ కూడా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు సమక్షంలో బీజేపీలో చేరారు. నరేంద్ర మోడీ పాలన, విధానాలు నచ్చడంతో బీజేపీలో చేరినట్లు బబితా ఇదివరకే తెలిపారు.