కజకిస్తాన్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు దూసుకెళుతున్నారు. గురువారం పురుషుల రెజ్లర్లు బజరంగ్ పూనియా, రవి దహియా సెమీఫైనల్కు చేరుకున్నారు. ఈ ఇద్దరు సెమీఫైనల్కు చేరడంతో వీరికి కాంస్య పతకం ఖాయం అయింది. అంతేకాదు ఒలింపిక్స్ బెర్త్ను కూడా ఖాయం చేసుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో కొరియాకు చెందిన సన్ జాంగ్ను 8-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన బజరంగ్ సెమీఫైనల్లోకి దూసుకొచ్చాడు.
ఒంటిచేత్తో మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్.. కోహ్లీ, ధావన్ ఎలా ఆశ్చర్యపోయారో చూడండి!! (వీడియో)
మరోవైపు పరుషుల 57 కేజీల విభాగంలో రవి దహియా జపాన్ క్రీడాకారుడు యుకి తకాషిని 6-1 తేడాతో ఓడించాడు. దీంతో ఒలింపిక్స్లో అడుగుపెట్టడంతో పాటు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ 62 కేజీల విభాగంలో నైజీరియా క్రీడాకారిణి అమెనాట్ అడెనియీ చేతిలో ఓడిపోయింది. అయితే అడెనియీ ఫైనల్కు చేరడంపైనే సాక్షి రెజ్లింగ్ చాంపియన్ షిప్ పతకం ఆధారపడి ఉంది.
ఇప్పటికే మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్ ఫోగాట్ కాంస్య పతకం సాధించడంతో పాటు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ముకైదా చేతిలో ఓటమి ఎదురైనా.. రెపిచేజ్ రౌండ్లో వరల్డ్ నంబర్ వన్ హెల్దెబ్రాండ్తో పాటు మరో ఇద్దరిని చిత్తుచేసి సత్తా చాటింది. బుధవారం జరిగిన రెపిచేజ్ పోటీల్లో వరుసగా వినేశ్ 5-0తో యులియా ఖవాడ్జీ బలహిన్యా (ఉక్రెయిన్)ను, ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్ సారా అన్ హెల్దెబ్రాండ్ (అమెరికా)ను 8-2తో, మారియా ప్రెవోలారకీ (గ్రీకు)ను 4-1తో చిత్తు చేసింది. రెండు విజయాల తర్వాతే విశ్వక్రీడల్లో చోటు పక్కా చేసుకున్న ఫోగట్.. చివరిదైన కాంస్యపోరులో మారియాను కట్టడి చేయగలిగింది.