సిడ్నీ: వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నమెంట్లో ఆడడం తనకెంతో ప్రతిష్టాత్మకమని భారత క్రికెటర్ రోహిత్ శర్మ అన్నారు. గురువారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 126 బంతుల్లో 137 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అంతే కాదు టీమిండియా సెమీ ఫైనల్స్కు చేరడంలో రోహిత్ శర్మ పాత్ర మరువలేనిది. ఓ ప్రముఖ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయమై మాట్లాడారు. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లలో తానెప్పుడూ మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తానని అన్నారు.
వరల్డ్ కప్లో సెంచరీ సాధించడం ఎంతో ప్రత్యేకం. అయితే సరైన సమయంలో సెంచరీ చేసి జట్టు విజయంలో దోహదపడాలనేది తన అభిప్రాయమని చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్లో సాధించే ప్రతి సెంచరీ కూడా స్పెషల్ అని అన్నారు.

కొన్ని సందర్భాల్లో సెంచరీలు సాధించినా మ్యాచ్ గెలవలేకపోయామనే భావన బాధిస్తుందన్నారు. ఈ వరల్డ్ కప్ తనకి ఎంత ప్రత్యేకమో మాటల్లో చెప్పలేనని అన్నారు. వరల్డ్ కప్లో తొలి సెంచరీని నమోదు చేసిన రోహిత్ శర్మ 70 పరుగుల వరకు చాలా నెమ్మదిగా ఆడి, ఆ తర్వాత తన బ్యాట్ను ఒక్కసారిగా ఝళిపించాడు.
126 బంతుల్లో 137 పరుగులు చేసిన రోహిత్ శర్మ అందులో 14 ఫోర్లు, 3 సిక్సులు ఉండటం విశేషం. మొట్టమొదట పిచ్ అనుకూలంగా బ్యాటింగ్ చేస్తానని, ఆ తర్వాత ఒక్కసారిగా బ్యాటింగ్ పుంజుకుంటుందని చెప్పారు. దానికి అనుగుణంగానే తన ప్రణాళిక ఉంటుందన్నారు.